జూ. ఎన్టీఆర్ రాజీ?: ఫ్లెక్సీపై బాలయ్య పక్కనే ఫొటో

ఇటీవల ఆయన దమ్ము మీడియా సమావేశంలో రాజకీయాల గురించి విస్తృతంగా మాట్లాడారు. వంశీ వ్యవహారాలను తనకు అంటగట్టడం సరి కాదని, తన అదుర్స్ సినిమాకు వంశీ నిర్మాత మాత్రమేనని, మరణించే వరకు తాను తెలుగుదేశం పార్టీతోనే ఉంటానని ఆయన చెప్పారు. అయితే, చంద్రబాబు పేరును మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్ విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.
ఆశ్చర్యకరంగా శనివారం నెల్లూరు జిల్లా కోవూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఫ్లెక్సీపై జూనియర్ ఎన్టీఆర్ ఫొటో కనిపించింది. చంద్రబాబు ఈ సమావేశంలో ప్రసంగించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు వరుసగా ఫ్లెక్సీపై కనిపించాయి. బాబాయ్ బాలయ్య ఫొటో పక్కనే అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్ ఫొటో ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ప్రధాన పాత్ర పోషిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కోవూరు పార్టీ కార్యకర్తలు ఆ ఫోటోను ముద్రించారా, చంద్రబాబు ఆదేశాల మేరకే అలా జరిగిందా అనేది తెలియదు. అయితే, చంద్రబాబు మాత్రం ఆ విషయంపై ఏమీ మాట్లాడినట్లు లేదు. అయితే, చంద్రబాబు మాత్రం మాటన్నారు. తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, తమ పార్టీ ఇబ్బందుల్లో లేదని, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని ఆయన అన్నారు. దీన్నిబట్టి తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాల నుంచి బయట పడిందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.












Click it and Unblock the Notifications