జగన్ను నమ్మితే మీరూ జైలుకు పోతారు: చంద్రబాబు
అవినీతిపరులతో హైదరాబాదులోని జైళ్లు నిండిపోయాయని ఆయన అన్నారు. వైయస్ జగన్ 885 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, ఆ డబ్బులతో పాయకరావుపేట నియోజకవర్గంలో రోడ్లు వేయవచ్చునని, మంచినీటి సమస్యను పరిష్కరించవచ్చునని ఆయన అన్నారు. జగన్ పార్టీకి ఓటేసి మోసపోవద్దని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెసు దొంగల పార్టీ అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గజదొంగల పార్టీ అని, దొంగల పార్టీకి గజ దొంగల పార్టీ సహకరిస్తోందని ఆయన అన్నారు. ఈ విషయమై ప్రజల్లో చైతన్యం రావాలని ఆయన అన్నారు.
కాంగ్రెసు నాయకులు మద్యం సిండికేట్లతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణనే దొంగసారా వ్యాపారం చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణ వల్లనే విశాఖపట్నానికి వోక్స్ వ్యాగన్ రాలేదని, వోక్స్ వ్యాగన్ రాకపోవడానికి బొత్స సత్యనారాయణ అవినీతి కారణమని ఆయన అన్నారు. ప్రజలకు మంచినీరు ఇచ్చే పరిస్థితి లేదు గానీ కాంగ్రెసు నాయకులు వారితో సారా తాగించే పరిస్థితి ఉందని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను అంబేడ్కర్ విగ్రహాల కన్నా పెద్దగా పెడుతున్నారని, దోచుకుంది దాచుకోవడానికే వైయస్సార్ కాంగ్రెసు నాయకులు ఆ విధంగా చేస్తున్నారని, అంబేడ్కర్ను అవమానిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఎస్సీలకు అన్యాయమే చేశారని ఆయన అన్నారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు సముద్ర తీరాన్ని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని గౌరవించేవారే లేరని ఆయన అన్నారు.