పిఎం విందుకు దీదీతో పాటు కరుణ, మాయ డుమ్మా
ఆరోగ్యం సరిగా లేనందున తాను హాజరు కావడం లేదని కరుణానిధి తెలియజేసినట్లు సమాచారం. అయితే, యుపిఎ ప్రభుత్వ మూడో వార్షికోత్సవానికి తమ పార్టీ సీనియర్ నాయకుడు టిఆర్ బాలును కరుణానిధి పంపిస్తున్నారు. దీదీ మాత్రం తన గైర్హాజరుకు కారణమేదీ చెప్పలేదు. ఆమె రాష్ట్ర వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసుకు, తృణమూల్ కాంగ్రెసుకు మధ్య పెరుగుతున్న దూరాన్ని ఇది సూచిస్తోందని అంటున్నారు.
తనకు ఆహ్వానం అందిందని, అయితే హాజరు కావాలా, వద్దా అనే విషయంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని మాయావతి అంటున్నారు. గత మూడేళ్ల యుపిఎ - 2 ప్రభుత్వం సాధించిన విజయాల ప్రగతి నివేదికను మన్మోహన్ సింగ్ విడుదల చేస్తారు. కీలకమైన అంశాలపై భాగస్వామ్య పార్టీలు విభేదిస్తూ వచ్చినప్పటికీ యుపిఎ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుంది.
యుపిఎ సంకీర్ణ భాగస్వామ్య శక్తులు 2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యే వాతావరణం ఉంది. పెరుగుతున్న ధరలు, అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు యుపిఎ భాగస్వామ్య పక్షాలకు వచ్చే ఎన్నికల్లో కష్టాలు తెచ్చి పెడుతాయని భావిస్తున్నారు. పట్టణ జనాభాలో 66 శాతం మంది ప్రభుత్వం పనితీరు పట్ల అసంతృప్తి చెందుతున్నట్లు సర్వే ఫలితాలు వెలువడిన నేపథ్యంలో తృతీయ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతోంది.