విజయమ్మతో భేటీ: జగన్కు మద్దతని రంగారావు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలియజేయడానికి తాను వచ్చానని ఆయన చెప్పారు. ప్రజల అభీష్టం మేరకు తాను నిర్ణయం తీసుకుంటానని, ఒకట్రెండు రోజుల్లో నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతానని ఆయన చెప్పారు. హైదరాబాదుకు వచ్చిన తర్వాత తనను ఎవరూ అడ్డుకోలేదని ఆయన చెప్పారు. వైయస్ జగన్పై సిబిఐ దర్యాప్తు తీరు సరిగా లేదని ఆయన అన్నారు.
జగన్ను విచారణకు పిలిచిన సమయం సరిగా లేదని, విచారణ జరపకూడదని తాను అనడం లేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన సమయంలో వైయస్ జగన్ను విచారణకు పిలువడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్పై ఆరోపణలు మాత్రమే వచ్చాయని, ఆరోపణలు రుజువు కాలేదని, ఆరోపణలు రుజువు అయ్యే వరకు జగన్ తప్పు చేశారని చెప్పలేమని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో జగన్ను విచారణకు పిలువడం వల్ల ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, జగన్ను వేధిస్తున్నారని భావిస్తున్నారని ఆయన అన్నారు.
మోపిదేవి వెంకటరమణ అరెస్టు ప్రభావం ఉప ఎన్నికలపై ఉండబోదని, మోపిదేవిపై ఆరోపణలు ఇంకా రుజువు కాలేదని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పడక తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ప్రజల అభిప్రాయం మేరకు వ్యవహరిస్తానని, తాను ఏమీ ఆశించడం లేదని, కొన్ని సమీకరణాల వల్ల తనకు మంత్రి పదవి దక్కలేదు కావచ్చునని ఆయన అన్నారు. వైయస్ జగన్ అరెస్టు అయినా పార్టీ నిలబడుతుందనే నమ్మకం ఉందని, ఒక వ్యక్తి వల్ల పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉండదని ఆయన అన్నారు.