బెయిల్ పిటిషన్: తన అరెస్టు అక్రమమని జగన్
రాజకీయ దురుద్దేశంతోనే తనను అరెస్టు చేశారని ఆయన విమర్శించారు. తన అరెస్టు వెనక రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల హస్తం ఉందని ఆయన అన్నారు. తన ఆస్తుల కేసుపై 9 నెలలుగా దర్యాప్తు జరుగుతోందని, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో తనను అరెస్టు చేయడం వల్ల ఎన్నికల ప్రచారం దెబ్బ తింటుందని ఆయన అన్నారు. తొమ్మిది నెలల పాటు తనను పిలువకుండా ఎన్నికల సమయంలో పిలిచి, అరెస్టు చేయడం సరి కాదని ఆయన అన్నారు.
తన ఆస్తుల కేసులో సిబిఐ మూడు చార్జిషీట్లు దాఖలు చేసిందని, మొదటి చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకుని తనకు సమన్లు జారీ చేసిందని ఆయన చెప్పారు. తాను మూడు రోజుల పాటు సిబిఐ ముందు హాజరయ్యానని, సిబిఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, అయితే వారు కోరుకున్న సమాధానాలు తాను ఇవ్వలేదని ఆయన అన్నారు. తనను దురుద్దేశంతో అక్రమంగా అరెస్టు చేశారని ఆయన విమర్శించారు.
ఉప ఎన్నికలు తన ప్రతిష్టకు సంబంధించినవని, ఇప్పుడు తన పార్టీ తరఫున పోటీ చేస్తున్నవారు గతంలో కాంగ్రెసులో ఉన్నారని, తన కోసం తన పార్టీలోకి వచ్చారని, వారిని గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందని, అందువల్ల తాను ప్రచారం సాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మిగతావారికి వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన విషయంలో సిబిఐ అత్యుత్సాహం ప్రదర్శించిందని ఆయన అన్నారు. ఈ పిటిషన్పై సిబిఐ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వైయస్ జగన్ ఇంతకు ముందు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సిబిఐ కోర్టు కొట్టేసింది.
కాగా జగన్ బెయిల్ పిటిషన్ను సిబిఐ కోర్టు 31వ తేదికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐకి ఆదేశించింది. అలాగే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది. మరోవైపు సిబిఐకి కూడా కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేసేందుకు హైకోర్టు అనుమతించింది.