తప్పు చేయలేదు: ఏరాసు, ఇంట్లోనే ఉన్నా: పట్టాభి

గాలి జనార్దన్ రెడ్డికి పట్టాభి రామారావు బెయిల్ మంజూరు చేసిన వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. తెలిసీ తెలియకుండా వార్తలు రావడం తనకు మనస్తాపం కలిగించిందని ఆయన అన్నారు. తన కుటుంబానికి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉందని, తన తండ్రి పార్లమెంటు సభ్యుడిగానూ శాసనసభ్యుడిగానూ ఉన్నారని, తాను మూడోసారి శాసనసభ్యుడిగా గెలిచానని, మంత్రిగా ఉన్నానని, ఇప్పటి వరకు తన కుటుంబంపై గానీ తనపై గానీ మచ్చ లేదని ఆయన అన్నారు.
కుంభకోణం చేసినట్లు గానీ భూకబ్జాకు పాల్పడినట్లు గానీ హత్యలు చేసినట్లు గానీ తనపై ఆరోపణలు లేవని ఆయన అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలను ఖండిస్తున్నానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చానని, విచారణ జరిపించాలని కోరానని, తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అన్నారు. మీడియా వార్తలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. తనపై ఈ విధమైన ఆరోపణలు రావడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తన పరువుకు నష్టం జరిగిందని, ఏం చేయాలో చెప్పాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
మీడియాలో ఓసారి మంత్రి అన్నారని, ఆ తర్వాత రాయలసీమకు చెందిన మంత్రి అన్నారని, కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి అన్నారని, చివరకు తన పేరు చెప్పారని ఆయన అన్నారు. తాను ఏ విధమైన తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం వ్యవహారంతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు. తనకు గాలి జనార్దన్ రెడ్డి బంధువు అవుతారని, నీలం సంజీవ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా బంధువులే అవుతారని, చిరంజీవి కూడా బంధువు అవుతారని ఆయన అన్నారు.
మీ పేరే రావడానికి కారణం ఏమిటని అడిగితే అది మీరే చెప్పాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. మీడియాలో వచ్చిన వార్తలకు తాను మనస్తాపం చెందినట్లు ఆయన తెలిపారు. గాలి జనార్దన్ రెడ్డి చంచల్గుడా జైలులో ఉన్నప్పుడు అధికారికంగానే తనిఖీకి వెళ్లానని, దొంగతనంగా వెళ్లలేదని ఆయన చెప్పారు. తాను జైల్లో గాలి జనార్దన్ రెడ్డిని కలుసుకోలేదని ఆయన చెప్పారు. తాను గాలి జనార్దన్ రెడ్డి కోసం వెళ్లలేదని ఆయన చెప్పారు. గాలి జనార్దన్ రెడ్డి కలుసుకోవాలనుకుంటే వెళ్లాలనుకుంటే దొంగతనంగా వెళ్తాను గానీ అధికారికంగా ఎలా వెళ్తానని ఆయన అడిగారు.
తాను ఇంట్లోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లలేదని గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ వ్యవహారంలో సస్పెన్షన్కు గురైన న్యాయమూర్తి పట్టాభి రామారావు అన్నారు. మీడియా వార్తలు తనకు మనస్తాపాన్ని కలిగించిందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తనను సిబిఐ అధికారులు సంప్రదించలేదని ఆయన చెప్పారు. సస్పెన్షన్ ఆర్డర్ అందిందని చెప్పారు. తన నివాసంలో సిబిఐ సోదాలు జరగలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications