ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు..?
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏక కాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించారు. డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో డీఏఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంధువులు, సహచరులకు చెందిన 5 ప్రాంతాల్లోనూ సోదాలు జరిపారు. భారీగా ఆస్తుల పత్రాలు గుర్తించారు.
వీటిలో కర్మన్ ఘాట్ లో రూ.2.63 కోట్లు విలువ చేసే రెండు ప్లాట్లు, అలాగే జీ+3 పెంట్ హౌస్.. దీని విలువ రూ.1.61 కోట్లుగా ఉంది. ఇక యాచారం నల్లవెల్లిలో 10 ఎకరాల 08 గుంటల వ్యవసాయ భూమి.. దీని విలువ రూ.25.50 లక్షలు.. అలాగే నగర పరిధి, శివార్లలో 8 ఖాళీ స్థలాలు.. దీని విలువ రూ.62.84 లక్షలుగా ఉంది.
ఇక బాలాపూర్ లోని నరేంద్ర బార్ అండ్ రెస్టారెంట్ లో పెట్టుబడులు.. వీటి వాటా రూ.86 లక్షలుగా ఉంది.

వీటితోపాటు అధికారుల సోదాల్లో రూ.4 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లో రూ.8.60 లక్షల నిల్వలు, 680 గ్రాముల బంగారు ఆభరణాలు.. రూ.5.85 లక్షలు, మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు.. వీటి విలువ రూ. 59 లక్షలు.. అలాగే రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు.. బ్యాంకులో 46 తులాల బంగారం తాకట్టు పెట్టి రుణం.. ఇప్పటివరకు మొత్తం ఆస్తుల విలువ రూ.6.87 కోట్లుగా ఏసీబీ అంచనా వేసింది. ఇక గతంలోనే 2009 లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు ఏసీబీ వెల్లడించింది. శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశామని.. జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications