ఇకపై అలిపిరి మెట్ల మార్గంలో..: టీటీడీ ఓ నూతన ప్రయత్నం
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. బుధవారం నాడు ఏకంగా 76,464 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 36,913 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.94 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది.
టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.27 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.63 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,494 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కాగా.. తిరుమలలో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, భక్తుల భద్రతను మరింత పటిష్టం పర్చడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రోబో డాగ్ ను అందుబాటులోకి తీసుకుని రానుంది. ఈ క్వాడ్రుపెడ్ రోబో పనితీరును టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి.. తిరుమల పద్మావతి అతిథి గృహం వద్ద పరిశీలించారు.
అటవీ ప్రాంతాల్లో మనుషులు వెళ్లలేని, ప్రమాదకర ప్రదేశాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడానికి ఈ రోబోను వినియోగించే అవకాశాలపై ఆరా తీశారు. ఇందులో ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీల లైడార్, వివిధ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అమర్చారు. వీటి సహాయంతో చీకటి, పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించడం సాధ్యపడుతుంది.
వన్యప్రాణులు, మనుషులు, వాహనాలు, పశువులను గుర్తించి వర్గీకరించే సామర్థ్యం.. ఇందులో అమర్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కు ఉంది. వన్యప్రాణుల కదలికలను గుర్తించినప్పుడు జియో ట్యాగ్డ్ అలర్ట్ను పంపిస్తుందీ రోబో డాగ్. దీంతో పాటు లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్ను కంట్రోల్ రూమ్, పెట్రోలింగ్ సిబ్బందికి అందజేస్తుంది. అలిపిరి- తిరుమల కాలిబాటకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేస్తుంది.
వన్యప్రాణులు.. భక్తుల రాకపోకల ప్రాంతం వైపు వచ్చినప్పుడు రోబోలోని సౌండ్, లైట్ యూనిట్లను ఉపయోగించి వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించే అవకాశాన్ని కూడా పరిశీలించారు సీహెచ్ వెంకయ్య చౌదరి. ఈ రోబో ఇప్పటికే అమలులో ఉన్న కెమెరా ట్రాప్, ఫుట్ పెట్రోలింగ్, అటవీ సిబ్బంది నిఘా వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా కాకుండా, వాటికి అదనంగా మొబైల్ మానిటరింగ్ వ్యవస్థగా పనిచేసేలా వినియోగించే ఆస్కారం ఉంటుంది.
అవసరాన్ని బట్టి వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దీనిని త్వరగా మోహరించే వీలుంటుంది. దీని ద్వారా సేకరించే వీడియోలు, థర్మల్ ఫొటోలు, వన్యప్రాణుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాటి కదలికలను మరింత సమర్థవంతంగా గుర్తించడానికి, అవసరమైన ప్రాంతాల్లో సిబ్బంది పెట్రోలింగ్ సమయాలు, నిఘాను పెంచవచ్చని టీటీడీ అభిప్రాయపడుతోంది.














Click it and Unblock the Notifications