ఫస్ట్ డే: జగన్ను విచారిస్తున్న సిబిఐ, స్థలం మార్పు

అయితే జగన్ విచారణ స్థలాన్ని సిబిఐ అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా మార్చారు. కోఠిలోని సిబిఐ కార్యాలయంలో జగన్ను విచారించే అవకాశముందని అందరు తొలుత భావించారు. కానీ భద్రత కారణాల దృష్ట్యా జైలు పరిసరాలలోనే జగన్ను ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులు సిద్ధమయ్యారు. చంచల్గూడ జైలు నుండి జైళ్ల శాఖ డిజి కార్యాలయానికి తరలించారు. సీనియర్ ఆఫీసర్స్ మెస్లోకి జగన్ను వెనుక గేటు ద్వారా తీసుకు వెళ్లారు. అక్కడే అతనిని విచారిస్తున్నారు. డిజి ఆఫీసు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.
సిబిఐ అధికారులు ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఐదు రోజుల పాటు విచారించనున్నారు. కాగా సిబిఐ కస్టడీపై హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత న్యాయవాదులు జైలుకు వచ్చి జగన్ను శనివారం కలిశారు. కోర్టులో జరిగిన వాదోపవాదాలపై ఆయనకు వివరించినట్లుగా సమాచారం. కస్టడీలో వ్యవహరించాల్సిన తీరుపై మాట్లాడుకున్నట్టు సమాచారం. రెండు రోజులుగా జగన్కు జైలు అధికారులు ములాఖత్లు నిరాకరిస్తుండటంతో జగన్ శనివారం సాయంత్రం వరకు బ్యారక్కే పరిమితమయ్యారని తెలుస్తోంది.
ఆయన బ్యారక్ వద్దకే తోటి విఐపి ఖైదీలు వెళ్లి కొంతసేపు ముచ్చటించినట్టు సమాచారం. ఉదయం నుంచి కోర్టు విషయాలను తెలుసుకోడానికి జగన్ ఆసక్తిగా ఎదురుచూసినట్టు తెలిసింది. జైలు క్యాంటీన్లో వస్తువులు కొనుగొలు చేసేందుకు జగన్ ఖాతాలో ఆయన వర్గీయులు రూ.4 వేలు జమచేసినట్టుగా సమాచారం.












Click it and Unblock the Notifications