ఆట ఇప్పుడే మొదలైంది: రోజా, రామోజీ కలలు.. శోభా
వైయస్ విజయమ్మ మహిళ అని కూడా చూడకుండా కాంగ్రెసు పార్టీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొందరు నేతలు ఆమెను ఏకవచనంతో పిలిచే నీచ స్థాయికి దిగజారి పోయారని విమర్శించారు. విజయమ్మ రంగ ప్రవేశంతో అందరూ నోరు వెళ్ల బెట్టారన్నారు. విజయమ్మ, షర్మిలల సూటుకేసులు తెరిచి చూడటం ఆమెను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యసభ సభ్యుడు చిరంజీవి 70 లక్షళ ఓటర్లను మోసం చేశారని శోభా నాగి రెడ్డి విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీని హోల్ సేల్గా కాంగ్రెసుకు తాకట్టు పెట్టారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని రామోజీ రావు కలలు కంటున్నారని, కానీ అది ఎప్పటికీ జరగదన్నారు.
ఏ తప్పూ చేయలేదు కాబట్టే జగన్ కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని ఎదిరించగలిగారని జూపూడి ప్రభాకర రావు అన్నారు. జగన్ను నిర్బంధించినా ఆయన ఏ తప్పు చేయలేదని ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారన్నారు. వైయస్ మృతిపై వివరాలు అడిగితే సిబిఐ జెడి మాట్లాడలేదన్నారు. వైయస్ మృతి కేసు మూడు నెలలో పూర్తి చేసిన సిబిఐ జగన్ కేసును మాత్రం తొమ్మిది నెలలుగా విచారిస్తూనే ఉన్నారన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన కొండా సురేఖ గెలుపు ఖాయమన్నారు.
వైయస్ విజయమ్మ కాన్వాయ్లో తనిఖీలు నిర్వహించడం అమానుషమని అనంతపురంలో గుర్నాథ్ రెడ్డి అన్నారు. ప్రచారాన్ని అడ్డుకునేందుకే జగన్ అరెస్టు జరిగిందన్నారు. విజయమ్మపై కాంగ్రెసు నేతలు నోరుపారేసుకుంటే సహించేది లేదన్నారు. ఓ పార్టీ అధినేతను ప్రచారానికి దూరంగా ఉంచడం సరికాదని మరో పార్టీ నేత తోపుదుర్తి కవిత అభిప్రాయపడ్డారు. టిడిపి, కాంగ్రెసు కుట్ర కారణంగానే జగన్ అరెస్టు జరిగిందన్నారు. ఓటమి భయంతోనే వారు ఈ కుట్రకు తెరతీశారన్నారు.