జగన్కు హజారే సమర్థింపా?: పురంధేశ్వరి, చిరు హామీ
జగన్ జైలుకెళ్లడానికి కారణం అతని అవినీతియే కారణం అన్నారు. కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులపై అన్నా హజారే చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఒక వ్యక్తి అధికార దాహం వల్లే ఉప ఎన్నికలు వచ్చాయన్నారు. తెలుగుదేశం పార్టీ కంటే కాంగ్రెసు పార్టీ హయాంలోనే పలు సంక్షేమ పథకాలు ఎక్కువగా, మంచిగా అమలు జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏమాత్రం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పారు.
జగన్ ఆర్థిక నేర ఆరోపణలు వాస్తవాలు అని విచారణలో తేలితే జగన్ బయటకు రావడం కూడా కష్టమన్నారు. ఒక మహిళగా వైయస్ విజయమ్మ బాధను తాను అర్థం చేసుకుంటున్నానని, అయితే జగన్ చేసిన అవినీతిని ఒక్కసారి ఆమె ఆలోచించాలన్నారు. జగన్ కారణంగా నష్ట పోయిన వారిని ఓదార్చడానికి జీవిత కాలం కూడా సరిపోదని చురకలు వేశారు.
మంత్రులు, పారిశ్రామికవేత్తలు జగన్ కారణంగా కేసులో ఇరుక్కుంటున్నారని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిడి వెంకటేష్ కడప జిల్లాలో అన్నారు. జగన్మోహన్ రెడ్డి తాను చేసిన తప్పులను ఇప్పటికైనా ఒప్పుకోవాలని సూచించారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
జగన్ కుటుంబం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులు సానుభూతితో తప్ప గెలవలేమని భావిస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. న్యాయవ్యవస్థను కలుషితం చేసిన జగన్ గ్యాంగ్ను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. చిత్తూరు జిల్లాను తాను దత్తత తీసుకుంటున్నానని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. చిత్తూరును అబివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.