ఒకే ఒక్కడు చంద్రబాబు: నో స్టార్ అట్రాక్షన్
వైయస్సార్ కాంగ్రెసు తరఫున జైలు పాలయ్యే వరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఒక్కడే ప్రచార బాధ్యతను నిర్వహించారు. ఇప్పుడు పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల భుజాన వేసుకున్నారు. వీరిద్దరు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తురుపు ముక్కలుగా మారారు. తెలుగుదేశం పార్టీకి మాత్రమే చంద్రబాబు ఒక్కరే ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నాయకులు పెద్దగా రంగంలోకి దిగలేదు. స్థానికంగా సీనియర్ నేతలు ప్రచారం సాగిస్తున్నప్పటికీ ఇతర నియోజకవర్గాలకు పెద్దగా రావడం లేదు.
నందమూరి హీరోలు బాలకృష్ణ గానీ జూనియర్ ఎన్టీఆర్ గానీ ప్రచారానికి ఇప్పటి వరకు దిగలేదు. ప్రచారానికి తన అధినాయకుడిని పంపిస్తున్నానని, తాను వ్యక్తిగతంగా ప్రచారానికి వెళ్లడం లేదని బాలకృష్ణ ఇటీవల మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ ఉప ఎన్నికలను చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉప ఎన్నికల్లో ఏ మాత్రం సీట్లు గెలుచుకున్నా అది తెలుగుదేశం పార్టీకి చేర్పే అవుతాయి. ఉప ఎన్నికలు జరుగుతున్న 18 స్థానాలు కూడా చెప్పాలంటే, కాంగ్రెసు పార్టీకి చెందినవే. అయినప్పటికీ చంద్రబాబు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీనే తమకు ప్రధాన ప్రత్యర్థిగా భావించడం వల్ల కావచ్చు, చంద్రబాబు వైయస్ జగన్ను లక్ష్యం చేసుకుని విమర్శలు సాగిస్తున్నారు. జగన్ను సమర్థిస్తున్న వైయస్ విజయమ్మపై కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. జగన్ పెంపకంలో విజయమ్మ తప్పు చేశారనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. తీవ్రమైన ఎండను లెక్క చేయకుండా చంద్రబాబు ప్రచారం సాగిస్తున్నారు.