జగన్ సిఎం అయ్యేవారు, కాంగ్రెస్లో ఉన్నాఅరెస్ట్: ఆజాద్

ఉప ఎన్నికలు ప్రజలపై భారం మోపుతున్నాయని అన్నారు. ప్రభుత్వంపై ఈ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపవన్నారు. ప్రభుత్వం మారడానికి ఇవేమీ సాధారణ ఎన్నికలు కావని, మధ్యంతరం వచ్చే అవకాశమే లేదన్నారు. పూర్తి కాలం తామే కొనసాగుతామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కావాలంటే ఎంతో అనుభవం ఉండాలని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందే సమయానికి జగన్కు కేవలం మూడు నెలల ఎంపీ అనుభవం మాత్రమే ఉందన్నారు.
అప్పటికి ఆయన ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదన్నారు. వైయస్ మృతదేహం పక్కనుండగానే జగన్ అధికారం కోసం సంతకాలు సేకరించారని విమర్శించారు తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆయన అధికారాన్నే కోరుకున్నారని విమర్శించారు. అధికారమే ఆయనకు పరమావధి అన్నారు. తండ్రి చనిపోతే ఆ పదవిలో కూర్చుండబెట్టడానికి ఇది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నారు. వైయస్ మృతి కాంగ్రెసుకు తీరని లోటు అన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు తమ స్థానాలు తిరిగి రాబట్టుకోవాలని ఆకాంక్షించారు.
జగన్ ఒక్కడే జైలుకు వెళ్లలేదని, ప్రభుత్వానికైనా సిబిఐ కైనా ఎవరైనా సమానమే అన్నారు. చట్టం దృష్టిలో కాంగ్రెసు వ్యక్తికి ఓ న్యాయం, మిగతా వారికి మరో న్యాయముండదన్నారు. కాంగ్రెసు మిత్రపక్షమైన డిఎంకె ఎంపీలు కనిమొళి, రాజా, మహారాష్ట్ర, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మధుకొడా, యడ్యూరప్ప సురేష్ కల్మాడీ తదితరులు జైలుకెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ కేసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, హైకోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతోందన్నారు.
వైయస్ విజయమ్మ, షర్మిల చెప్పినట్లుగా జగన్ను ఎవరూ వేధించడం లేదని, ఆయన వెంట పడటం లేదని అన్నారు. చట్టం తన పని తాను చేసుకు పోతోందన్నారు. జైళ్లో ఉన్న వారంతా జగన్ కుటుంబీకుల్లా సిబిఐ పైన, కేంద్రం పైన విమర్శలు చేయడం లేదన్నారు. సిబిఐ దృష్టిలో ఎవరైనా ఒక్కటే అన్నారు. దేశ విదేశాల నుండి జగన్ కంపెనీలలోకి పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రపంచంలో ఏ రాజకీయవేత్త, ఏ పారిశ్రామికవేత్త ఇంత పెద్ద భవనాలు నిర్మించలేదన్నారు.
ఐదారువందల కోట్లతో హైదరాబాదు, బెంగళూరులలో భవంతులు నిర్మించాడన్నారు. జగన్ విషయంలో అసాధరణంగా ఎవరూ వ్యవహరించలేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డైనమిక్గా వ్యవహరిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కితాబిచ్చారు. ఆరోగ్యశ్రీని కాంగ్రెసు పార్టీయే ప్రారంభించిందన్నారు. కాంగ్రెసులో ఉన్నా లేకున్నా జగన్ అరెస్టయ్యేవారన్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెసునే గెలిపించాలన్నారు.
ఓటర్లు ఇప్పుడు చూపిస్తున్న తమ అభిమానం, ఆదరణను ఓట్ల రూపంలో 12వ తేదిన చూపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీని గెలిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications