సమాధులకూ జాగా లేకుండా...: వైయస్పై దేవేందర్
యువతకు ఉపాధి, నిరుద్యోగులకు ఉద్యోగాల ముసుగులో ఇష్టారాజ్యంగా భూములను కేటాయించారని ధ్వజమెత్తారు. ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలు, సెజ్లు అవ సరమని చెప్పి హైదరాబాద్ శివార్లలో 88,580 ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని తన అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. జంటనగరాల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే రూ. 2 వేల కోట్ల విలువైన భూములను పరిశ్రమల కోసమంటూ ప్రైవేటు వ్యక్తులకు సమర్పించుకున్నారని అన్నారు. ఈ భూములను ఎకరా కోటి రూపాయల చొప్పున విక్రయించాల్సి ఉండగా, రూ. 10 లక్షల నామమాత్ర ధరకు కట్టబెట్టారని చెప్పారు.
హైదరాబాద్ రింగ్ రోడ్డు పేరుతో పరిసరాల్లోని భూములను కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. మరో 2 వేల కోట్ల విలువైన భూములను నాటి కలెక్టర్ నవీన్ మిట్టల్కు అప్పగించారని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో స్మశానవాటికల ఏర్పాటుకు కూడా స్థలం లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అంత విలువైన భూములను కారుచౌకగా దక్కించుకున్న బడాబాబులు పర్రిశమలు తెస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారని ఆరోపించారు. రంగారెడ్డిలో లక్ష మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలనివ్వాలని పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పులివెందులనుంచి వచ్చిన వైయస్ అనుచరులు ఇప్పటికే వేల కోట్ల విలువైన భూములకు సంబంధించి సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆయన అన్నారు
నాడు అతి తక్కువ ధరలకే వైఎస్ సర్కారునుంచి భూములను పొందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తదితర బడాబాబులనుంచి ప్రభుత్వం ఇప్పటికైనా మార్కెట్ ధరలను వసూలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై కూడా సిబిఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యులైన నాటి మంత్రులు, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైయస్ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా జరిగిన భూ కేటాయింపుల వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తును డిమాండ్ చేస్తూ తాము ఉద్యమించనున్నామని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని దేవేందర్ గౌడ్ చెప్పారు.