రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యత సోనియా గాంధీకే
రాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రణబ్ ముఖర్జీ, లోకసభ స్పీకర్ మీరా కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి మినహా మిగతా అన్ని సార్లు రాష్ట్రపతి అభ్యర్థిని కాంగ్రెసు పార్టీయే ఎంపిక చేసిందని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇదే సమయంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిని కూడా సోనియా గాంధీ ఎంపిక చేస్తారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ప్రణబ్ ముఖర్జీకి అప్పగిస్తూ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించారు. ఆ తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
ప్రతిపక్షాలు, పౌర సమాజం పరంపరగా చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు కాంగ్రెస్ పార్టీపై ముప్పేట జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. "ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం క్రియాశీల విధి నిర్వహించాలి. అయితే కనీస మర్యాద విస్మరించి యుపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారు.''అని అన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్యుసీ) సమావేశంలో సోనియా ప్రారంభోపన్యాసం చేశారు. ప్రతిపక్షాలు, పౌర సమాజం చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని యుపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మన్మోహన్ సింగ్కు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు. పెట్రోలు ధర పెంపును ఆమె సమర్థించారు. ఈ నిర్ణయం సామాన్యుడిపై ప్రభావం చూపే మాట వాస్తవమే అయినా, ఆర్థిక సవాళ్ళను ఎదుర్కోవడం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమని చెప్పారు.
ప్రపంచమంతా విపత్కర పరిస్థితులు నెలకొన్నా, ఆ ప్రభావం భారత్పై పడకుండా ప్రధాని మన్మోహన్ సింగ్ సమర్థవంతంగా కృషి చేశారని కొనియాడారు. సవాళ్ళను అధిగమించి యుపీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రశంసదాయకమన్నారు. 2014 ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు.