థర్డ్ డే కస్టడీకి జగన్: మంత్రుల సమక్షంలో విచారణకు
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని, జివోలు జారీ చేసిన మంత్రులను ముఖాముఖిగా విచారించేందుకు సిబిఐ ప్రయత్నాలు చేస్తున్నదని తెలుస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఆరుగురు మంత్రులు సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న విషయం తెలిసింది. మోపిదేవి వెంకటరమణ, ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీ నారాయణలు సుప్రీం నోటీసులు అందుకున్నారు. మోపిదేవిని పలుమార్లు విచారించిన సిబిఐ ఇప్పటికే అతనిని అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు పంపించింది.
మంత్రి ధర్మాన ప్రసాద రావును కూడా విచారించింది. సబితా ఇంద్రా రెడ్డిని రెండుసార్లు ఆమె ఇంటికి వెళ్లి విచారించారు. పొన్నాల లక్ష్మయ్యను ఈ నెల 7న విచారణకు పిలిచారు. జగన్ను కూడా ఐదు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకున్నారు. మంగళవారం కాకుండా మరో రెండు రోజులు విచారించనున్నారు. అయితే జగన్ కస్టడీ పూర్తయిన తర్వాత మరోసారి ఆయన కస్టడీని సిబిఐ కోర్టును కోరే అవకాశముందని తెలుస్తోంది.
ఆయన కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తే ఈ కేసుతో సంబంధమున్న మంత్రులను, జగన్ను ముఖాముఖి విచారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ను అరెస్టు చేయకముందు అతనిని బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్ సమక్షంలో విచారించారు. ఓ సమయంలో ముగ్గురిని వేర్వేరు గదులలో ఉంచి జగన్కు, నిమ్మగడ్డకు, బ్రహ్మానంద రెడ్డికి ఒకే ప్రశ్నను సంధించి వారి సమాధానాలను టాలీ చేశారనే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు మంత్రుల సమక్షంలో జగన్ను విచారించడంతో పాటు వారిని వేర్వేరుగా ఒకే ప్రశ్నను వేసి విచారించే అవకాశముందని అంటున్నారు. దీంతో ఈ కేసులో జరిగిన అక్రమాలు వెల్లడవుతాయని అంటున్నారు. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ కోసం సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామకృష్ణా రెడ్డి, కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి వచ్చారు. సాక్షిలో పెట్టుబడులపై విరిని జగన్తో కలిపి విచారించే అవకాశముంది.