జైల్లో వైయస్ జగన్కు కనీవినీ ఎరుగని భద్రత
టవర్లన్నింటిపై సాయుధ గార్డులను ఏర్పాటు చేశారు. వారు 24 గంటలు నిఘా పెడతారు. ఒక్క క్షణం కూడా దృష్టి మళ్లించడానికి వీలు లేదు. ప్రత్యేక ఖైదీల బ్యారెక్కు దగ్గర్లో ఓ వాచ్ టవర్ ఉన్నట్లు, అక్కడ భద్రత పెంచినట్లు తెలుస్తోంది. బ్యారెక్ నుంచి క్షణం కూడా దృష్టి మళ్లించకూడదని భద్రతా సిబ్బందికి ఆదేశాలున్నట్లు సమాచారం. ఆకస్మిక తనిఖీలు చేసే సాయుధ సెంట్రీలను అధికారులు తనిఖీ చేస్తారని తెలుస్తోంది. విధుల్లో ఉండడానికి సెంట్రీలకు నిర్దిష్టమైన సమయాలు కేటాయించారు.
ప్రత్యేక తరగతి ఖైదీల ఎంక్లోజర్ వద్ద డిప్యూటీ జైలర్ లేదా జైలర్ స్థాయి అధికారిని నియోగించినట్లు వార్తలు వచ్చాయి. ఆ స్థాయి అధికారులు రోజులో రెండు సార్లు పరిశీలన జరుపుతారు. కానీ జగన్ జైలుకు వచ్చినప్పటి నుంచి ఆ స్థాయి అధికారి ఎల్లవేళలా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. బ్యారెక్లో ఏర్పాటు చేసిన సిబ్బందికి ఇది అదనం.
ప్రత్యేక తరగతి బ్యారెక్లో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. ప్రతి ఖైదీపై, వారి కదలికలపై భద్రతా సిబ్బంది నిరంతరం నిఘా పెట్టాల్సి ఉంటుంది. జగన్ రావడానికి ముందు అటువంటి ఏర్పాటు లేదు. జగన్ ములాఖత్లో తన కుటుంబ సభ్యులను కలవడానికి పరిపాలనా బ్లాక్కు వచ్చినప్పుడు ఆయన వెంట నలుగురు నలుగురు వార్డర్లు ఉంటారని తెలుస్తోంది. ఇతర ఖైదీలు ఆయన వద్దకు చేరుకోవడానికి వీలు లేకుండా వీరు కాపలా కాస్తారు. జగన్ బ్యారెక్ పక్కన కొన్ని సింగిల్ సెల్స్ ఉంటాయి. వాటిలో దుష్ప్రవర్తన గల ఖైదీలుంటారు. ఆ మార్గంలో జగన్ వెళ్లేటప్పుడు వాటికి తాళాలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
జైలు వెలుపల కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. వైయస్ జగన్తో పాటు హై సెక్యూరిటీ ఖైదీలను స్వేచ్ఛగా ఎంక్లోజర్స్ నుంచి బయటకు స్వేచ్ఛగా రానివ్వడం లేదని అంటున్నారు. రోజువారీ పనులు చేసేవారిని తనిఖీలు చేస్తున్నారు.