నాలుగో రోజు సిబిఐ కస్టడీకి జగన్, రేపటితో ఆఖరు
విజయ సాయి రెడ్డిని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని, వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముగ్గురిని కలిసి సిబిఐ అధికారులు విచారించనున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో విజయ సాయి రెడ్డి ఏ2 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఐదు రోజుల పాటు సిబిఐ తమ కస్టడీకి తీసుకొని విచారించనున్న విషయం తెలిసిందే. గురువారం జగన్ కస్టడీ ముగియనుంది.
కాగా అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సాక్షి మీడియా ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణా రెడ్డి, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిలతో కలిపి సిబిఐ అధికారులు మంగళవారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. జగతి పబ్లికేషన్స్లోకి పెట్టుబడులు వచ్చిన వ్యవహారంపై వారు చెప్పిన మాటలకు, వైయస్ జగన్ మాటలకు పొంతన లేకపోవడంతో వారందరినీ కలిపి సిబిఐ అధికారులు 40 నిమిషాల పాటు ప్రశ్నించినట్లు సమాచారం.
మంగళవారంనాడు వరుసగా మూడో రోజు సిబిఐ అధికారులు వైయస్ జగన్ను ప్రశ్నంచింది. సాయంత్రం ఐదు గంటలకు విచారణ ముగిసింది. అలాగే, జననీ ఇన్ఫ్రా పెట్టుబడులపై కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఇందుకుగాను జననీ ఇన్ఫ్రా డైరెక్టర్గా ఉన్న కాకినాడ కాంగ్రెసు శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని సిబిఐ పిలిచింది. కోఠిలోని సిబిఐ కార్యాలయంలో మంగళవారం విచారణ సాగింది.
గతంలో సజ్జల రామకృష్ణా రెడ్డిని, విజయసాయి రెడ్డిని సిబిఐ పలుమార్లు ప్రశ్నించారు. పెట్టుబడుల వ్యవహారంపై తమకేమీ తెలియదని, అంతా జగనే చూసుకుంటారని వారు గతంలో సిబిఐకి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు జగన్ తనకేమీ తెలియదని, సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డి చూసుకుంటారని అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో వారిద్దరిని జగన్తో కలిపి విచారించినట్లు తెలుస్తోంది.
వారందరినీ కలిపి 40 నిమిషాల పాటు ప్రశ్నించినట్లు సిబిఐ అధికారులు, ఆ తర్వాత విడివిడిగా ప్రశ్నించినట్లు చెబుతున్నారు. గత మూడు రోజులుగా వైయస్ జగన్ను దాదాపు 18 గంటల పాటు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. అయినా పెద్దగా సమాచారమేదీ రాబట్టలేదని అంటున్నారు. వైయస్ జగన్ సిబిఐ అధికారులు వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. రేపు బుధవారం మరింత మందిని పిలిపించి, వారితో కలిపి జగన్ను సిబిఐ అధికారులు విచారిస్తారని తెలుస్తోంది.