జగన్ అలా మారడానికి కారణం..: విజయమ్మపై బాబు
నేరస్తులైన భాను కిరణ్, మంగలి కృష్ణలతో సావాసం చేస్తే ప్రశ్నించలేదన్నారు. అప్పుడే జగన్ చేస్తున్న అసాంఘీక కార్యకలాపాలను విజయమ్మ అడ్డుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. జగన్ ఇలా తయారు కావడానికి వారి తల్లిదండ్రులే కారణమన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన బెయిల్ కోసం రూ.60 కోట్లు ఖర్చు చేశారని, అతను దేవుళ్లకు కూడా లంచాలు ఇచ్చారని మండిపడ్డారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రూ.45 కోట్లు లంచం ఇచ్చారన్నారు. కానీ వెంకటేశ్వర స్వామి దుర్మార్గులను శిక్షిస్తారన్నారు. ఇష్టానుసారం దోపిడీ చేసిన వారిని స్వామి వదలడన్నారు. తన బెయిల్ కోసం గాలి అరవై కోట్లు ఇస్తే జగన్ ఇంకా ఎన్ని వందల కోట్లు ఇస్తారో అని అనుమానం వ్యక్తం చేశారు. ఇదంతా పేదవాడి సొమ్ము అన్నారు. దోషుల్ని దోషులుగా చూడాలని ప్రజలకు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లనే అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందన్నారు. అక్రమాలు చేసి దోషులుగా నిలబడిన వారిపై సానుభూతి చూపిస్తే భవిష్యత్తులో కష్టమన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. జగన్ చేసిన తప్పులకు బెయిల్ రాదన్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. దివంగత వైయస్ బతికి ఉంటే జైలుకు వెళ్లే వారన్నారు.
టిడిపి నేత యనమల రామకృష్ణుడు హైదరాబాదులో మాట్లాడుతూ.. ఈసి వ్యవహారం వైయస్సార్ కాంగ్రెసుకు అనుకూలంగా ఉందని అన్నారు. అన్ని పార్టీల అభ్యర్థుల అఫిడవిట్లను నెట్లో పెట్టిన ఈసి ఆ పార్టీ అభ్యర్థుల అఫిడవిట్లను ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. వాన్ పిక్ భూకేటాయింపుల ఫైలుపై సంతకం పెట్టిన మంత్రులను కస్టడీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.