ఒంగోలు: హ్యాట్రిక్ బాలినేని శ్రీనివాస్రెడ్డికి కలిసొస్తుందా?

మాగుంట సుబ్బరామి రెడ్డి సతీమణి, ప్రస్తుత ఎంపి శ్రీనివాసుల రెడ్డి వదిన పార్వతమ్మను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. ఇక జిల్లాలో పెద్దాయనగా పేరొందిన మాజీమంత్రి దామచర్ల ఆంజనేయులు మనవడు జనార్దన్ను తెలుగుదేశం పార్టీ రంగంలోకి దింపింది. ఈ మూడు పార్టీల నేతలు తమకు సానుకూల అంశాలను లెక్కించుకుంటూ ప్రచారంలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. వాన్పిక్, బోగస్ ఓట్ల తొలగింపు కలిసి వస్తాయని టిడిపి, కాంగ్రెస్ ఆశిస్తున్నాయి.
నియోజకవర్గంలో ఇటీవల నలభై ఎనిమిది వేల ఓట్లను తొలగించారు. అవన్నీ గతంలో బాలినేనికి మద్దతుగా చేర్పించిన దొంగ ఓట్లేనని, వాటి తొలగింపు తమకు కలిసి వస్తుందని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు నమ్మకంతో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు వాన్పిక్లో అక్రమాలనే జగన్ పార్టీపైకి అస్త్రాలుగా ప్రయోగిస్తున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి మాణిక్య వరప్రసాద్ వాన్పిక్ భూముల్లో ఏరువాక సాగించి పోరు తీవ్రం చేశారు. బాధితుల దీక్షా శిబిరాన్ని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
అభ్యర్థి ఎంపికలో ముందున్న టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ ప్రచారంలో దీటుగా సాగుతున్నాయి. కాంగ్రెస్ తొలుత కొంత ఇబ్బంది పడినా జిల్లా, రాష్ట్రస్థాయి నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మూడు పార్టీలు ఏ విషయంలోనూ తీసిపోవడం లేదు. ఏ పార్టీలోనూ అసంతృప్తులు, అలకలు లేకపోవడం ఒంగోలు ప్రత్యేకత. నియోజకవర్గంలో బలమైన వర్గాలలో కమ్మ సామాజిక వర్గం ఒకటి. వీరితోపాటు వైశ్యులు, బలహీనవర్గాల ఓటర్లు తమనే ఆదరిస్తారని టిడిపి నమ్మకంగా చెబుతోంది.
బాలినేనికి పోటీగా మాగుంట కుటుంబం రంగంలో ఉండటం వల్ల రెడ్డి సామాజిక వర్గం ఓట్లలో చీలిక ఏర్పడుతుందని, ఇది తమకే కలిసి వస్తుందని టిడిపి లెక్కలు వేస్తోంది. మరో బలమైన కాపు సామాజికవర్గం ఓట్లతో పాటు, సంప్రదాయ ఓటు బ్యాంకు తమను గెలిపిస్తుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. అయితే... దళిత, ముస్లిం, రెడ్డి సామాజిక వర్గం ఓట్లతోపాటు బలహీనవర్గాలలో పెరిగిన అభిమానం, సానుభూతితో తమ గెలుపు ఎప్పుడో ఖరారైందని జగన్ పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications