రణరంగంగా పెట్రోకోక్ అభిప్రాయ సేకరణ, జీపులుధ్వంసం
పోలీసుల ఆధ్వర్యంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనుకున్నా గ్రామస్తులు తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు. గ్రామస్తులు కర్రలు, మారణాయుధాలతో దాడికి దిగారు. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. గ్రామస్తులు రెండు పోలీసులు జీపులను ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీఛార్జీలో పలువురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. రెండు మూడు గంటల పాటు పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకు వచ్చారు. దీంతో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించారు.
కాగా రాంబిల్లి మండలంలోని పెట్రో కోక్ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు స్పందించారు. అధికారులు పారిశ్రామికవేత్తలకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. పారిశ్రామికవేత్తల కోసం ప్రజల జీవితాలను బలిస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు మారినా విధానాలు మారటం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలు వద్దంటుంటే పరిశ్రమలు ఎందుకు పెడుతున్నారన్నారు. విశాఖ పట్ల కాంగ్రెసుకు ఎంత చులకన భావముందో అర్థమవుతోందన్నారు. అవినీతి అధికారులు ఎందరో జైళ్లలో మగ్గుతున్నప్పటికీ మిగతా వారికి మాత్రం బుద్ధి రావడం లేదన్నారు. కాగా పెట్రో కోక్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణను 33 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.