షర్మిల టార్గెట్ సోనియాగాంధీ, దాడి పెంచిన విజయమ్మ
సోనియా ఆదేశాలు ఇవ్వడమేమిటి జగన్ను అరెస్టు చేయడమేమిటని షర్మిల ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ తన కుటుంబం కంటే ప్రజలతోనే ఎక్కువగా మమేకమయ్యారన్నారు. కర్నూలుతో జగన్కు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి మంచి అనుబంధముందని చెప్పారు. సోనియా ఆదేశాలతోనే గత నెల 27న జగన్ను అరెస్టు చేశారని ఆరోపించారు.
కాంగ్రెసుకు ఓటేస్తే ఫ్యాక్షనిజానికి ఓటేసినట్లేనని షర్మిల అన్నారు. జరుగుతున్న అన్యాయానికి ఓటు ద్వారా బుద్ది చెప్పాలన్నారు. విచారణ పేరుతో ఆధారాలు లేకున్నా.. అబద్దపు సాక్ష్యాలతో జగన్ను జైల్లో ఉంచారన్నారు. రైతుల పక్షాన నిలబడి, తమ కుటుంబానికి అండగా నిలబడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి చెన్నకేశవ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.
వైయస్ జలయజ్ఞంతో సహా పలు అభివృద్ధి పనులు ఇక్కడి నుండే ప్రారంభించారని వైయస్ విజయమ్మ అన్నారు. వైయస్ ఉన్నప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన కాంగ్రెసు ఇప్పుడు ఆయనను నిందితుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. వైయస్ తనయుడి అయినందు వల్ల జగన్ను అరెస్టు చేశారన్నారు. జగన్ బయట ఉంటే పద్దెనిమిది మందిని గెలిపించుకోగల్గుతాడని భావించే అరెస్టు చేశారన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదు నడిబొడ్డున అప్పనంగా భూములు కట్టబెడితే ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. చంద్రబాబు పైన తాను కేసు వేసినప్పుడు నెల రోజులు అయినా సిబిఐ విచారణ ప్రారంభించలేదని, అదే జగన్ ఆస్తుల కేసు విషయంలో మాత్రం ఒక్క రోజులోనే ప్రారంభించారన్నారు. బోఫోర్స్ కుంభకోణంలో సోనియా ఇంటి పైన, మద్యం సిండికేటు కేసులో బొత్స సత్యనారాయణ ఇళ్లలో దాడులు జరిపారా అని ప్రశ్నించారు.
వైయస్ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, మహిళలను లక్షాధికారులను చేయాలని చూశారన్నారు. పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నారన్నారు. కానీ ఈ ప్రభుత్వం పథకాలను నీరుగారుస్తోందన్నారు. దశ చరిత్రలో పన్నులేయని ప్రభుత్వం వైయస్దే అన్నారు. 170 మంది ఎంపీలపై కేసులు ఉంటే అరెస్టు చేశారా అని ప్రశ్నించారు. వైయస్ ముఖ్యమంత్రి కాకముందే జగన్కు కర్నాటక, కరీంనగర్లలో ప్రాజెక్టులు ఉన్నాయన్నారు.
సిబిఐ కేంద్రం కనుసన్నుల్లో నడుస్తోందని ఆరోపించారు. జగన్ కాంగ్రెసులో ఉంటే ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి అయి ఉండేవారని ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారని, తద్వారా వారు తమ కుటుంబంపై కక్ష తీర్చుకుంటున్నట్లుగా అర్థమవుతోందన్నారు. వైయస్ మరణంపై ఎన్నో సందేహాలు ఉన్నాయన్నారు. తనకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని తామే చంపుకున్నామని కాంగ్రెసు నేతలు చెబుతున్నారని, ఇది తను ఎంతో కలిచి వేస్తోందన్నారు. జగన్కు అధికార దాహమే ఉంటే 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేసినప్పుడే ముఖ్యమంత్రి అయయే వాడన్నారు. వైయస్సార్కు అసెంబ్లీలో సంతాపం తెలిపేందుకు రెండు నెలలు పట్టిందని విమర్శించారు. జగన్ను అరెస్టు చేసినప్పుడే తాను ప్రశ్నించానని, కానీ ఎందుకు అరెస్టు చేశారో చెప్పలేదన్నారు.
మేమేమైనా విదేశీయులమా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారానికి వస్తుంటే తమ సూటుకేసులు కూడా తనిఖీలు చేస్తున్నారని, ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా అన్నారు. పద్దెనిమిది మంది అభ్యర్థులను గెలిపించుకునేందుకే తాను బయటకు వచ్చానని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రవేశ పెట్టే పథకాలు పార్టీ జెండాలోనే ఉన్నాయన్నారు. దేవుడుపై నుండి, ఇక్కడ మీరు వైయస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తున్నారని అన్నారు.
కాగా మంత్రాలయం శాసనసభ్యుడు బాలనాగి రెడ్డి ఎర్రకోటలో వైయస్ విజయమ్మ, షర్మిలలను కలిశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా వారిని కలిశారు.