రికార్డుందంట, నేను వెళ్లి వినాలంట: వైయస్ విజయమ్మ

వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు ఉన్నట్లు రష్యా మీడియా కూడా కథనం ప్రచురించిందని చెప్పారు. ఏడు నిమిషాల వాయిస్ మాత్రమే రికార్డ్ అయిందని చెప్పడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి హెలికాప్టర్లో ప్రయాణం చేసేటప్పుడు మూడు రూట్ మ్యాప్లు ఉంటాయని, కానీ ఒక్క మ్యాప్ కూడా కనిపించడం లేదన్నారు. గన్మెన్ వెస్లీ గన్లో బుల్లెట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
వైయస్ మృతిపై తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారన్నారు. రికార్డ్ కోసం పౌరవిమానయాన శాఖ మంత్రికి లేఖ పెట్టారని, అయితే ఆ లేఖ ఎంపీ అయినప్పటికీ జగన్కు ఇవ్వలేదన్నారు. ఓ ఎంపీ తన వద్ద రికార్డ్ ఉందని చెబుతున్నారని, తాను వెళ్లి వినాలట అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీనిని ప్రమాదంగా చెప్పి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఈ ప్రమాదంపై తాను కూడా జగన్ను అప్పుడే అడిగానని అన్నారు.
రైతుల కోసం పదవీ త్యాగం చేసిన వారిని ఉప ఎన్నికలలో గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పథకాలు ప్రతి ఇంటికి అందాయన్నారు. వైయస్ ఆశయాలు జగన్ పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రజల గుండెల్లో వైయస్ నిలిచి ఉన్నారని, ఆయన రాజకీయాల్లోనే ఎక్కువగా సేవ చేస్తానని చెప్పేవారని అన్నారు. వైయస్ మృతి తర్వాత సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోయాయని చెప్పారు.
నిరుపేదలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులలో వైయస్ ఓ రోల్ మోడల్ అని విజయమ్మ అన్నారు. నాయకులు మరిచిపోయినా తమ వెంట ప్రజలు ఉన్నారని ఆమె అన్నారు. జగన్ క్లీన్చిట్తో బయటకు వస్తారన్నారు. కాంగ్రెసు పార్టీలో ఉంటే జగన్కు ఈ వేధింపులు ఉండేవి కావని వారి వ్యాఖ్యలను బట్టే అర్థమవుతోందన్నారు. జనాల్లో ఉన్నాడు కాబట్టే వేధిస్తున్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే జగన్ చేసిన తప్పు అన్నారు.












Click it and Unblock the Notifications