రమణతో ఏళ్ల రాజకీయ వైరం: కవిత, మద్యంపై నివేదిక
మద్యం సిండికేట్ కేసులో అరెస్టైన నున్నా రమణ తనకు డబ్బులు ఇచ్చినట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. ఆయనతో తమ కుటుంబానికి ముప్పై ఏళ్లుగా రాజకీయ వైరం ఉందన్నారు. కావాలనే తనను ఈ కేసులో ఇరికించారని అన్నారు. ముఖ్యమంత్రితో తాను ఎసిబి నోటీసులపై చర్చించలేదని చెప్పారు. తన భర్త ట్రాన్సుఫర్ విషయమై చర్చించానని అన్నారు. ఈ నెల 20వ తేదిన ఎసిబి విచారణకు హాజరవుతానని చెప్పారు. కక్ష సాధింపులో భాగంగా తన పేరును ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం సిండికేట్ల కేసులో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) సోమవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో మధ్యంతర నివేదికను సమర్పించింది. ఎసిబి తన మధ్యంతర నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల రెండుసార్లు పలు జిల్లాల్లో ఎసిబి మద్యం సిండికేటు వ్యాపారులపై దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
మరోవైపు న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిని కలిశారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారానికి సంబంధించి ఏరాసు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. బెయిల్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని ఆయన సిఎంకు వివరించినట్లుగా తెలుస్తోంది. అనంతరం ఏరాసు మాట్లాడుతూ.. గాలి బెయిల్ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తప్పు చేస్తే రాళ్లతో కొట్టాలని అన్నారు.