నాతో ఫొటో దిగలేదా: చంద్రబాబును అడిగిన కోలా
కోలా కృష్ణమోహన్ పత్రికా ప్రకటన విడుదల చేశారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రిక ఆ విషయాలను ప్రచురించింది. కోలా కృష్ణమోహన్కు చెందిన పత్రికా ప్రకటన వివరాలు ఇతర మీడియాలో రాలేదు. సాక్షి దినపత్రిక కోలా కృష్ణమోహన్ ప్రకటనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించింది.
‘చంద్రబాబూ... మీ ఇంట్లో నా నుంచి కోటి రూపాయలు తీసుకున్నది వాస్తవం కాకపోతే.. మరి బీబీసీ న్యూస్ చానల్కిచ్చిన ఇంటర్వూల్లో డబ్బు తిరిగిస్తున్నట్లు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? రూ.4 కోట్ల(అంటే అప్పట్లో 5 లక్షల 70 వేల గ్రేట్ బ్రిటన్ పౌండ్స్)ను నాకున్న మిడ్ల్యాండ్ బ్యాంక్ ఖాతా నుంచి మీ డ్యూష్ బ్యాంక్(జర్మన్) అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా?' అని ఆయన అడిగారు.
చంద్రబాబు తనకు విదేశాల్లో బ్యాంక్ ఖాతాలు లేవని చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. చంద్రబాబే స్వయంగా తనకు ఐదు విదేశీ బ్యాంక్ ఖాతాల నంబర్లు ఇచ్చి.. అందులో డబ్బు వేయమన్నారని కోలా చెప్పారు. సీబీఐ, ఈడీతో విచారణ జరిపిస్తే విదేశీ ఖాతాలు ఎంత డోర్మాట్లో(సస్పెన్స్ అకౌంట్స్, క్లోజ్ అకౌంట్స్) ఉన్న విషయం బయటకొస్తుందనే భయంతోనే చంద్రబాబు ఇలా బుకాయిస్తున్నారని ఆయన చెప్పారు.
‘అంతే కాదు.. నారా లోకేష్ నా డబ్బుతో ఇంట్లో నుంచి ఒక మహిళా టీచర్తో జంప్ అయినప్పుడు.. ఆ రోజు విజయవాడ పర్యటనలో ఉన్న మీరు నా భుజంపై చేయి వేసి, పక్కకు తీసుకెళ్లి బెంగళూరు వెళ్లి వెతకమని చెప్పడం వాస్తవం కాదా? ఆ తర్వాతి రోజున పత్రికల్లో మీరు నా భుజంపై చేయి వేసిన ఫోటో పతాక శీర్షికన వచ్చిన మాట నిజం కాదా?' అని నిలదీశారు.
తనను ‘420' అని చంద్రబాబు వ్యాఖ్యానించడంలో వాస్తవముందని కోలా అంగీకరించారు. అయితే, ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, ముఖ్యమంత్రి కుర్చీ లాక్కున్న చంద్రబాబు విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటని కోలా కృష్ణమోహన్ అభిప్రాయపడ్డారు.