జగన్పై స్పందిస్తాం: కిరణ్ బేడీ, హైదరాబాద్పై ఘాటైన..

తాజాగా జరిగిన ఉప ఎన్నికలలో ఓటు కోసం ఒక్కో కుటుంబానికి రూ.15వేల రూపాయలు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగిందని, ఒక్క బెయిల్ కోసం కోట్ల రూపాయలు ఇచ్చి జడ్జినే కొన్న హైదరాబాద్ సొంతం అని ఎద్దేవా చేశారు. ఇదంతా నల్లధనమే అన్నారు. ఇలాంటివి మరెన్నో వెలికి తీయాలంటే స్వతంత్ర దర్యాఫ్తు సంస్థలు, పటిష్టమైన న్యాయవ్యవస్థలు అవసరమని అన్నారు. తామంతా దీని కోసమే పోరాడుతున్నామని తమకు సహకారం అందించాలని కోరారు. బలమైన లోక్ పాల్ వ్యవస్థ ఉంటే రాజకీయ నేతలలో భయం ఉంటుందన్నారు.
ఈ బిల్లును పటిష్టంగా రూపొందిస్తామని స్వయంగా ప్రధాని అన్నాకు లేఖ రాశారని అయినా అది నెరవేరలేదని ఆమె అన్నారు. ప్రధాని రాసిన లేఖను ఆమె విలేకరులకు చూపించారు. దేశంలో ఒకదాని తర్వాత ఒక కుంభకోణం వరుసగా వెలుగులోకి వస్తోందన్నారు. బొగ్గు గనుల కేటాయింపులపై స్వతంత్ర సంస్థతో దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ దేశానికి అవినీతి రాజధాని అన్నారు.
అన్నా బృందం విడుదల చేసిన అవినీతి మంత్రుల జాబితాలో ప్రణబ్ ముఖర్జీ పేరు ఉందన్నారు. ప్రణబ్ పైన ఉన్న అవినీతి మచ్చ మాసిపోదన్నారు. దేశానికి అవినీతి ఆరోపణలు లేని గొప్ప నాయకుడు రాష్ట్రపతి కావాలన్నారు. ఆంధ్రాలో ఇంత అవినీతి జరుగుతుంటే ఇన్నాళ్లు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా, ఎంతటి వారినైనా వదలకూడదన్నారు. సిబిఐని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని రాహుల్ గాంధీయే గతంలో అన్నారని గుర్తు చేశారు.
మన్మోహన్ సింగ్ది దృతరాష్ట్ర పాలన అన్నారు. ప్రజలు ఓటింగును బహిష్కరించి అవినీతిపై తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. వైయస్ ప్రభుత్వం హయాంలోని అవినీతిపై శ్రీధరన్ సూచించినప్పుడే చర్యలు తీసుకుంటే ప్రమాదం తప్పేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిపై తాము చర్చించి స్పందిస్తామన్నారు. సిబిఐ, కేంద్రం కుట్రతో జగన్ను అరెస్టు చేసిందని తాము ఏనాడూ అనలేదని కిరణ్ బేడీ చెప్పారు.












Click it and Unblock the Notifications