చంద్రబాబును అడిగిన పిఏ సంగ్మా, జగన్పార్టీని కొడుకు

బాబుతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాలని బాబును కోరానని, ఉప ఎన్నికల అనంతరం పార్టీ నేతలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని చెప్పారని సంగ్మా చెప్పారు. సంగ్మా జగన్ పార్టీ నేతలను కలవలేదు. అయితే ఆయన వెళ్లాక ఆయన తనయుడు జేమ్స్ సంగ్మా మంగళవారం లోటస్పాండ్లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఆ పార్టీ నేతలతో భేటీ అయ్యారు.
వైవి సుబ్బా రెడ్డి, మైసూరా రెడ్డిలతో ఆయన సమావేశమయ్యారు. ఉప ఎన్నికలలో జగన్ పార్టీ అభ్యర్థులు దాదాపు పదిహేను ఆపై గెలుస్తారని సర్వేలు చెబుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతి అభ్యర్థి కీలకం. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతు కోరేందుకే జేమ్స్ సంగ్మా వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడిన జూనియర్ సంగ్మా మాత్రం తన తండ్రి రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించేందుకు రాలేదని చెప్పారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో తన తండ్రి సంగ్మాకు మంచి సంబంధాలు ఉండేవని, వైయస్ మృతిపట్ల ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు వచ్చానని చెప్పారు. కాగా సంగ్మా సొంత పార్టీ ఎన్సీపి మాత్రం ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పార్టీ యుపిఏ అభ్యర్థికి మద్దతు పలకనుంది. కాగా సంగ్మా తనయ అగాథ సంగ్మా తన తండ్రి తరఫున కాన్వాస్ చేయడానికి పార్టీ ఆమోదం తెలపలేదని తెలుస్తోంది.
మంగళవారం రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 16న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 30 వరకు నామినేషన్లకు గడువు. జూలై 2న నామినేషన్ల పరిశీలన, జూలై 4న ఉపసంహరణ గడువు. జూలై 19న పోలింగ్ జరుగుతుంది. 22వ తేదిన ఫలితాలు చెబుతారు.












Click it and Unblock the Notifications