ఎంపీగా అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ఏకగ్రీవం
ఎంపీగా మహిళల ఉన్నతి కోసం పాటుపడతానని చెప్పారు. కనౌజ్ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తానని చెప్పారు. తన భర్త, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఆమె ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. కాగా ఉత్తర ప్రదేశ్లోని కనౌజ్ లోకసభ స్థానం నుంచి డింపుల్ యాదవ్ నామినేషన్ వేసినప్పటికీ ఇతరులు ఎవరూ వేయని విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ ఖాళీ చేసిన ఈ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఆయన సతీమణి డింపుల్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని మొదటే కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకుంది.
అధికారిక ప్రకటన కూడా చేసింది. అంతేకాదు ఉప ఎన్నికలలో డింపుల్ యాదవ్కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకుంది. విపక్ష బహుజన సమాజ్ పార్టీ కూడా ఉప ఎన్నికలలో పోటీకి విముఖత చూపింది. ఈ స్థానంలో తమ పార్టీ అభ్యర్థిని నిలపరాదని నిర్ణయించినట్లు బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు కూడా. కాంగ్రెసు, బిఎస్పీ పోటీకి విముఖత చూపినప్పటికీ భారతీయ జనతా పార్టీ మాత్రం పోటీకి ఆసక్తి చూపింది.
ఈ స్థానంలో తమ అభ్యర్థిని నిలబెట్టాలని బిజెపి నిర్ణయించినప్పటికీ అది కుదరలేదు. బిజెపి అభ్యర్థి జగ్దేవ్ యాదవ్ నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లేసరికి సమయం దాటిపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. ఇక ఈ స్థానంలో డింపుల్ యాదవ్తోపాటు మరో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీకి దిగారు. అయితే వారు కూడా చివరి నిమిషంలో బరిలో నుండి తప్పుకున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో డింపుల్ ఏకగ్రీవం ఖాయమైంది.