ఉప ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రారంభం

లెక్కింపు కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతను ఉంచారు. పరకాల నియోజకవర్గం ఓట్ల లెక్కింపును వరంగల్ పట్టణంలోని కాకతీయ మెడికల్ కళాశాలలో చేస్తున్నారు. లెక్కింపు కోసం 12 టేబుల్స్ వేశారు. 19 రౌండ్లు ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, నర్సాపురం నియోజకవర్గాల ఓట్లను ఏలూరులోని వట్లూరు వద్ద గల సిఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్కిస్తున్నారు. లెక్కింపు కోసం మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 800 వందలకు పైగా పోలీసులతో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. పోలవరం నియోజకవర్గం లెక్కింపు కోసం 16 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 16 రౌండ్లు ఉంటాయి. నర్సాపురం కోసం 12 టేబుల్స్ వేశారు. 12 రౌండ్లు ఉంటాయి.
గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో చేశారు. 14 టేబుల్స్తో 17 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. మాచర్ల నియోజకవర్గం ఓట్ల లెక్కింపు గుంటూరులోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో లెక్కిస్తారు. 14 టెబుల్స్ వేశారు. 16 రౌండ్లు ఉంటాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం ఓట్ల లెక్కింపును నెల్లూరు నగర శివారులోని కనపర్తిపాడులో ఉన్న ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో చేస్తున్నారు. 19 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది.
నెల్లూరు లోకసభ ఓట్ల లెక్కింపును కూడా ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలోనే చేస్తున్నారు. ఈ లోకసభ స్థానం పరిధిలో నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కొవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు ఉన్నాయి. కందుకూరు మినహా అన్ని పై కళాశాలలోనే లెక్కింపు జరుగుతోంది. కందుకూరు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు మాత్రం ఒంగోలులో జరగనుంది. 17 రౌండ్లలో నెల్లూరు ఫలితాలు వెలువడనున్నాయి.
కడప జిల్లాలోని రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును కడపలోని జెఎంజె కళాశాలలో చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాలకు పద్నాలుగు టేబుల్స్ను ఏర్పాటు చేశారు. తిరుపతి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో జరుగుతోంది. 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 19 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కర్నూలు పట్టణంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగనుంది. ఒక్కో నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డ 14 రౌండ్లలో, ఎమ్మిగనూరు 16 రౌండ్లలో పూర్తవుతుంది.
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, అనంతపురం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో జరుపుతున్నారు. ఒక్కో నియోజకవర్గం కోసం పద్నాలుగు చొప్పున టేబుల్స్ వేశారు. నరసన్నపేట నియోజకవర్గం ఓట్ల లెక్కింపు శ్రీకాకుళంలోని గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగుతోంది. ఇందుకోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
పాయకరావుపేట ఓట్ల లెక్కింపు విశాఖపట్నంలోని ఎల్.బుల్లయ్య కళాశాలలో జరగుతోంది. ఇందుకోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో జరగనుంది. 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఓట్ల లెక్కింపును కాకినాడలోని ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాలలో చేస్తారు. 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications