జగన్ కేసు: ఈడి విచారణకు సిబిఐ కోర్టు గ్రీన్ సిగ్నల్

జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టారని భావిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిని విచారించనున్నారు. ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్, సునీల్ రెడ్డి, విజయరాఘవలను విచారిస్తారు. ఓఎంసి కేసులో శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, శ్రీలక్ష్మిలను విచారిస్తారు. నిందితులను పదిహేను రోజులలో విచారించాలని కోర్టు ఈడికి ఆదేశాలు జారీ చేసింది.
ఈ రోజు(మంగళవారం) నుండి పదిహేను రోజులలో వారి విచారణ పూర్తి కావాల్సి ఉంది. ఈడి నిందితులకు సమన్లు జారీ చేసి విచారించనుంది. పదిహేను రోజుల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈడి సాధ్యమైనంత త్వరగా సమన్లు జారీ చేయనుంది. కాగా ఆయా కేసులలో రిమాండులో ఉన్న నిందితులను విచారించేందుకు ఈడి ఇటీవల పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. విచారణకు కోర్టు అనుమతించడంతో ఈడి ఎమ్మార్, జగన్ ఆస్తులు, ఓఎంసి కేసులలో విదేశాల నుండి అక్రమంగా వచ్చిన పెట్టుబడులపై ఆరా తీయనుంది.
కాగా ఓఎంసి కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి జ్యూడిషియల్ రిమాండును కోర్టు వచ్చే నెల 6వ తేది వరకు పొడిగించింది. ఓఎంసి కేసులో నిందితులను ఇంకెంతకాలం జైలులో పెడతారని, వారిపై అభియోగాలు నమోదు చేయాలని గతంలోనే ఆదేశించామని, ఇంకెన్ని వాయిదాలు కోరతారని కోర్టు ఈ సందర్భంగా సిబిఐని ప్రశ్నించింది. అభియోగాలు నమోదు చేయకుంటే నిందితులను విడుదల చేయమంటారా అని న్యాయస్థానం ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications