3వరోజు కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు, బస్సుల సీజ్
ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించిన 39 ప్రయివేటు బస్సులను, 40 పాఠశాలల, కళాశాలల బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదిలాబాద్, నిర్మాల్లో 19, రాజమండ్రిలో 4, ప.గోదావరిలో 35 స్కూల్ బస్సులు, రెండు ప్రయివేట్ బస్సులు, మెదక్లో 12, ఖమ్మంలో ఐదు బస్సులను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో నాలుగు బస్సుల స్కూల్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
రాజధాని హైదరాబాదులో మూడు విద్యాసంస్థల బస్సులను సీజ్ చేశారు. దిల్సుఖ్ నగర్లో తనిఖీలు చేపట్టిన అధికారులు సరైన ప్రమాణాలు పాటించకుండా తిరుగుతున్న మూడు బస్సులను స్వాధీనం చేసుకున్నారు. ఫిట్నెస్తో పాటు ఇతర కారణాల వల్ల వాటిని సీజ్ చేశారు. ఈ మూడు బస్సులు రెండు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందినవి కాగా ఒకటి పాఠశాల బస్సు.
కాగా గత మూడు రోజులుగా ఆర్టీఏ అధికారులు ముమ్మరంగా ట్రావెల్స్, ప్రయివేటు బస్సుల తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం వరకు రాష్ట్రంలో 36 బస్సులను సీజ్ చేశారు. అందులో 18 బస్సులు కాళేశ్వరి ట్రావెల్స్కు చెందినవే. మరో రెండు రోజులు తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎన్ని అక్రమ రవాణా బస్సులు బయటపడతాయో చూడాలి.