వైయస్ విజయమ్మ కన్నీరు కార్చలేదు: జగన్ పార్టీ నేత
జగన్ను అరెస్టు చేసినప్పుడు విజయమ్మ కంటతడి పెట్టారేమోగానీ ఆ తర్వాత 12 రోజుల ప్రచారంలో ఎక్కడా ఆమె కన్నీళ్లు పెట్టిన సందర్భమే లేదని, టివిలు చూసిన వారికి ఈ విషయం తెలుసునని అన్నారు. ప్రజలు విస్పష్టంగా తమ వైఖరిని ఎన్నికలలో వెల్లడిస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు గందరగోళంలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
చంద్రబాబు కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎందుకు తాపత్రయపడుతున్నారో, అసలు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును పరిరక్షించాలనే బాధ్యతను ఆయన భుజ స్కంధాలపై ఎందుకు వేసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఉప ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కొన్ని పత్రికలకు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలలో తమకు ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం లేదని, ఎవరో చెబితే అవిశ్వాస తీర్మానం పెట్టబోమని చెప్పడం ఆయన దౌర్భాగ్యస్థితికి నిదర్శనమన్నారు.
కిరణ్ సర్కారు మెజార్టీ అత్తెసరుకు పడిపోయిన తరుణంలో దానిని ఒక సువర్ణవకాశంగా తీసుకొని బాబు ప్రజా వ్యతిరేక సర్కారును ఎందుకు ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలలో ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయింది బాబు అసలు ఒక్కసారైనా ఘాటుగా విమర్శించారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వం ఎలా పడిపోతుందని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.