రిపోర్టర్లపై కాదు, జెడి తీరుపైనే అభ్యంతరం: అంబటి
మీడియా రిపోర్టర్లు సమాచారం తీసుకోవడం తప్పు కాదని, లక్ష్మినారాయణ సమాచారం ఇవ్వడమే తప్పని ఆయన అన్నారు. క్రైమ్ రిపోర్టర్లు తమను అపార్థం చేసుకోవద్దని ఆయన అన్నారు. క్రైమ్ రిపోర్టర్ల పేర్లను, మొబైల్ ఫోన్లను తమ పార్టీ నాయకులు డిస్ప్లే చేయడంపై ప్రతిస్పందిస్తూ వారి నెంబర్లు అందరికీ తెలిసినవేనని, దాని వల్ల పెద్దగా నష్టమేమీ లేదని అన్నారు. వారికి బెదిరింపులు వస్తే తాము అండగా నిలబడుతామని ఆయన చెప్పారు.
సిబిఐ జెడి లక్ష్మినారాయణను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాము రిపోర్టర్ల నుంచి లక్ష్మినారాయణకు వెళ్లిన ఫోన్ల వివరాలను తెలియజేయలేదని, లక్ష్మినారాయణ ఫోన్ల నుంచి వెళ్లిన కాల్ లిస్టును మాత్రమే ఇచ్చామని ఆయన అన్నారు. దర్యాప్తునకు సంబంధించిన సమాచారం మీడియాకు ఇవ్వదలుచుకుంటే మీడియా సమావేశం పెట్టి వెల్లడించాలని, లీక్లు ఇవ్వకూడదని, హైకోర్టు మార్గదర్శక సూత్రాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయని ఆయన అన్నారు.
సిబిఐ కోర్టు న్యాయమూర్తిగా నాగమారుతి శర్మ కొనసాగుతున్నట్లు ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చిందని, ఆ వార్త రావడాన్ని తాము తప్పు పట్టడం లేదని, కానీ కుట్రపూరితంగా వ్యవహారాలు నడుస్తున్నాయనేది తమ ఉద్దేశమని ఆయన అన్నారు. లక్ష్మినారాయణ ఎవరెవరితో మాట్లాడారో తమ వద్ద వివరాలు ఉన్నాయని, ఏం మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో లక్ష్మినారాయణ చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సిబిఐ మాన్యువల్కు భిన్నంగా లక్ష్మినారాయణ మాట్లాడారని ఆయన విమర్శించారు.
తమ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సింది మీడియా కాదని, లక్ష్మినారాయణ అని ఆయన అన్నారు. లక్ష్మినారాయణ లీక్లపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రిపోర్టర్లు జెడితో మాట్లాడడం తప్పు కాదని, తాము వారిని ఇందులోకి లాగడం లేదని ఆయన స్పష్టం చేశారు. సాక్షి రిపోర్టర్లు కూడా జెడికి అందరి లాగే ఫోన్లు చేసి ఉండవచ్చునని ఆయన అన్నారు. మీకు, మీడియా యజమానులకు జెడి నుంచి వెళ్లిన కాల్స్ వివరాలు మాత్రమే ఇచ్చామని ఆయన చెప్పారు.
రామాయణంలో పిడకలవేట మాదిరిగా వ్యవహారంలోకి వచ్చిన చంద్రబాల ఎవరో వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. జెడి చంద్రబాలకు ఫోన్ చేశాడని, చంద్రబాల ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు ఫోన్ చేశారని, గ్రేహౌండ్స్ ఐజికి కూడా ఆమె ఫోన్ చేశారని ఆయన చెప్పారు. ఈ విషయాలపై తాము రాష్ట్రపతికి, ప్రధానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.