మమతను రెచ్చగొట్టిన ప్రణబ్, టిఎంసి నేత కబీర్కు ఫోన్
ప్రణబ్ ముఖర్జీ తన అభ్యర్థిత్వం కోసం మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా పలు పార్టీలకు, నేతలకు ఫోన్లు చేస్తున్నారు. అబ్దుల్ కలాం ససేమీరా అనడంతో యుపిఏపై గుర్రుగా ఉన్న మమత ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం చూస్తోంది. ఇలాంటి సమయంలో ప్రణబ్ తృణమూల్ కాంగ్రెసు నేతకే ఫోన్ చేసి ఆ పార్టీలో అలజడి రేపారు. ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న మమత ఓ సమయంలో యుపిఏ నుండి బయటకు వెళ్లేందుకు కూడా సిద్ధపడింది.
ఇందుకోసం ఆమె తన పార్టీకి చెందిన కేంద్రమంత్రుల రాజీనామాలు తీసుకుంది. అంత ఖచ్చితంగా వ్యవహరిస్తున్న మమతకు ప్రణబ్ ఝలక్ ఇస్తూ... ఆ పార్టీ సీనియర్ నేత, అసమ్మతి పార్లమెంటు సభ్యుడు కబీర్ సుమన్కు బుధవారం ఫోన్ చేశారట. ప్రణబ్ ఫోన్ తర్వాత కబీర్ మాట్లాడుతూ... తాను రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్కే ఓటు వేస్తానని ప్రకటించారు. ప్రణబ్ అత్యుత్తమ అభ్యర్థి అని, ఆయనే నెగ్గాలన్నది తన ఆకాంక్ష అని ఆయన చెప్పారు.
అంతేకాదు, తనను ప్రణబ్ మద్దతు కోరలేదని, కేవలం తన ఆరోగ్యం గురించి ఆరా తీసేందుకే ఫోన్ చేశారని చెప్పుకొచ్చారు. ప్రణబ్ ఫోన్ చేయడం, కబీర్ కూడా తన ఓటు అతనికే అని చెప్పడం చూస్తే కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే ఆరా తీశారనే వ్యాఖ్యలతో తృణమూల్ ఏకీభవించడం లేదు. దీనిపై ఆ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
తమ పార్టీని చీల్చేందుకు ప్రణబ్ ప్రయత్నిస్తున్నారంటూ దుమ్మెత్తి పోసింది. అది ఆయన తరం కాదని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. ప్రణబ్ చేసింది రాజకీయంగా తప్పు కాకపోవచ్చునని, అయితే కాస్తయినా నైతికత ఉండాలి కదా అని చెప్పుకొస్తున్నారు. ఓ అసమ్మతి నేతకు ఇలా ఫోన్ చేయడం సరికాదంటున్నారు.
కాగా ఇప్పటికే పలు పార్టీలు ప్రణబ్కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ప్రణబ్ దాదాకే ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయేలో కూడా చాలా పార్టీలు, నేతలు ప్రణబ్కు జై కొడుతున్నారు. శివసేనతో పాటు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప దాదాకు ఓకె చెప్పారు. తాజాగా లెఫ్ట్ పార్టీలు కూడా ప్రణబ్కు మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.