ఎందుకు ఓడామంటే: చిరు నివేదికలోనూ జగన్ కామన్
సానుభూతి పవనాల కారణంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిక స్థానాలలో గెలుపొందిందని కిరణ్, బొత్స నివేదికలు అందజేశారు. ఉప ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక కుట్ర దాగి ఉందని, తమ కుటుంబంపై కాంగ్రెసు పెద్దలు కక్ష కట్టారని వైయస్ విజయమ్మ, షర్మిలలు కన్నీరు కార్చడం కారణంగా సానుభూతి పవనాలు వీచినందునే మెజారిటీ స్థానాలలో గెలుపొందారని వివరించారు.
ఇదే అంశం కామన్గా చిరంజీవి నివేదికలోనూ ఉండే అవకాశముందని అంటున్నారు. అయితే చిరంజీవి తన నివేదికలో సానుభూతితో అంశంతో పాటు ప్రధానంగా పార్టీలో సమన్వయం లేకపోవడాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి తన నివేదికలో సంస్థాగతంగా ఉన్న లోతుపాతులను గురించి కూడా ప్రస్తావించారని తెలుస్తోంది. బొత్స ఇచ్చిన నివేదికలో ఫలితాలకు సానుభూతితో పాటు.. పాలనాపరమైన మరికొన్ని కారణాలను కూడా కూలంకషంగా వివరించినట్లుగా తెలుస్తోంది.
నామినేటెడ్ పదవుల నియామకం చేపట్టక పోవడం కూడా గెలుపు అవకాశాలను దెబ్బతీసిందని వారు మేడంకు చెప్పారని తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాలలో దశాబ్దాలుగా పార్టీ నడుపుతున్న వారు అటు వైపు వెళ్లడంతో నష్టం జరిగిందని సిఎం చెప్పారని తెలుస్తోంది. అంతేకాకుండా స్థానిక సమస్యలు కూడా ఇందుకు తోడయ్యాయని వారు వివరించారని సమాచారం. నరసాపురం, రామచంద్రాపురంలలో గెలుపుపై వారు వివరించినట్లుగా తెలుస్తోంది.
ఇక చిరంజీవి కూడా మరో రెండు మూడు రోజులలో మేడంకు నివేదిక ఇవ్వనున్నారు. పిఆర్పీ విలీనమైనా కాంగ్రెసుకు ఒరిగిందేమీ లేదని జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకునేలా.. తనతో పాటు పార్టీలోకొచ్చిన వారితో ఎక్కడ, ఎలాంటి ఫలితాలు సాధించిందీ వివరించేలా చిరంజీవి నివేదిక రూపొందిస్తున్నారట.
రామచంద్రాపురం, నరసాపరంలో తనతోపాటు కాంగ్రెసులోకొచ్చిన పిఆర్పీ నాయకులు స్థానిక కాంగ్రెసు యంత్రాంగంతో మమేకమై పని చేయడంతోనే విజయం సాధించామని, మిగిలిన చోట్ల అలా వ్యవహరించక పోవడం వల్ల నష్టం జరిగిందని ఆయన నివేదిక రూపొందిస్తున్నారని అంటున్నారు. తిరుపతిలో వెంకటరమణ పరాజయంపై ప్రత్యేకంగా నివేదికలో వివరణ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.