నాకు క్లీన్చిట్: సబితారెడ్డి, శ్రీలక్ష్మిని విచారిస్తున్న ఈడి

మొదటి రోజు గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసు నిందితులను విచారిస్తున్నారు. ఈ కేసులో అరెస్టై మహిళా జైలులో ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్, ఓఎంసికి చెందిన బివి శ్రీనివాస రెడ్డిని ఈడి అధికారులు విచారిస్తున్నారు. ఉదయం పదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు వీరిని ఈడి అధికారులు విచారిస్తారు.
వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో వైయస్ జగన్తో పాటు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, బిపి ఆచార్యలను 25న ఈడి ప్రశ్నించనుంది. ఎమ్మార్ కేసు నిందితులను 26వ తారీఖున విచారిస్తారు. మూడు కేసులలోని రిమాండు ఖైదీలను విచారించేందుకు అనుమతించాలని ఈడి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వారి పిటిషన్కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వారు ఈరోజు నుండి విచారిస్తున్నారు.
మరోవైపు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఓఎంసి కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ఆమె మెదక్ జిల్లాలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఓఎంసి కేసులో తనకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పారు. అవసరమైతే మళ్లీ విచారణకు సిద్ధమన్నారు. కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థులపై ఉద్యమ కేసులు ఉంటే ఎత్తివేస్తామని ఆమె ప్రకటించారు.












Click it and Unblock the Notifications