చిరంజీవితో ఏకీభవించిన శంకరన్న, పాలడుగు కౌంటర్
ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్లో చేరిన వారిని కలుపుకోనందువల్లే ఉప ఎన్నికల్లో అనుకున్నంత ఫలితాలు రాలేదన్న చిరంజీవి అన్నారు. చిరంజీవి ఆరోపణలు సరికాదని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చిరంజీవి వ్యాఖ్యలు తనను గాయపరిచాయని సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు తప్పుబట్టారు. చిరంజీవి వ్యాఖ్య లు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చని, వాటిని పార్టీ వేదికపైనే చర్చిస్తామని ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ బొత్స అన్న విషయం తెలిసిందే.
ఒకటి రెండు నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని నియోజక వర్గాల్లో కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేశామన్నదే తన అభిప్రాయమని చెప్పారు. ఒకటి, రెండు స్థానాల్లో అభ్యర్థి ఎంపిక, ఇతర విషయాల్లో కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చిన మాట నిజమేనని అంగీకరించారు. తిరుపతి అభ్యర్థిని తాను నిర్ణయించలేదన్న చిరంజీవి మాటలను ఆయన కొట్టి పారేశారు. చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి సూచించిన అభ్యర్థినే తాను ఎంపిక చేశానని చెప్పారు.
కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా చిరంజీవి ప్రజారాజ్యం నాయకుడి మాదిరి మాట్లాడుతున్నారని ఒక విలేకరి వ్యాఖ్యానించగా, మీరీ ప్రశ్న వారిని అడగండని బొత్స తప్పించుకున్నారు. పిసిసి చీఫ్గా తాను పార్టీ అభిప్రాయం మాత్రమే చెబుతానని, వ్యక్తిగత అభిప్రాయాల గురించి వివరణ ఇవ్వలేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకూ రెండు పార్టీలు లేవని, అందరూ ఒకటేనని, అంతా కలిసి 2014లో అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆయనను వివరణ కోరే ప్రసక్తి లేదన్నారు.
రెండు పార్టీల కలయిక జరిగినప్పుడు కొన్ని వ్యత్యాసాలు ఉండడం మామూలేనన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి రక్తహీనత లేదని, పార్టీని ఉద్దేశించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తనను గాయపరిచాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అన్నారు. సిఎల్పీ ఆవరణలో ఆయన శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తిపైనో ఏ శక్తిపైనో ఆధారపడి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చిరంజీవికి హితవు పలికారు. నామినేటెడ్, సంస్థాగత పదవుల భర్తీకి సంబంధించి ఏదైనా ఉంటే కిరణ్, బొత్సలతో మాట్లాడుకోవాలే తప్ప.. బాహాటంగా విమర్శలకు దిగడం సరికాదన్నారు.
కాంగ్రెస్కు రక్తహీనత లేదని మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి కూడా వ్యాఖ్యానించారు. ఏ వ్యక్తి కారణంగానో రామచంద్రపురం, నరసాపురాల్లో కాంగ్రెస్ గెలవలేదని, ప్రజలు ఓట్లేస్తేనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని, చిరంజీవి కూడా ప్రజల్లో ఒకరని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గతంలో చేసిన తప్పులపై కాంగ్రెస్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి ఉందని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు స్పష్టం చేశారు.