ఓ ఊరి కుర్రాడు అంతటి టెర్రరిస్టుగా ఎలా మారాడు?
జబీ పదో తరగతి వరకు ఉర్డూ మీడియా పాఠశాలలో చదివాడు. అతని తండ్రి మజాల్గావ్లోని చిన్న దుకాణంలో పనిచేసే వాడు. ఆ తర్వాత సొంతంగా వడ్రంగి వ్యాపారం ప్రారంభించాడు. ఆ తర్వాత కొంత కాలానికి దాన్ని వదిలేశాడు. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత సిమితో సంబంధాలు ఏర్పడి జబహుద్దీన్ ముంబై దాడుల కేసులో కీలక అనుమానితుడిగా మారిపోయాడు.
అంతకు ముందు జబిహుద్దీన్ బీడ్లోని భారత సాంకేకిక సంస్థలో శిక్షణ పొందాడు. అయితే, స్థిరమైన ఉద్యోగమేదీ చేయలేదు. ఉద్యోగం కోసం ఔరంగాబాద్ వెళ్లాడు. అయితే అతనికి సరైన ఉద్యోగం దొరకలేదు. అక్కడే అతనికి ఔరంగాబాద్, మాలేగావ్, పర్భానీ యువకులు పలువురితో స్నేహం కుదిరింది. సిమీకి బలమైన అనుచరుడిగా మారిపోయాడు. టీ స్టాల్ల వద్ద, డాబాల వద్ద అతను నిషేధిత సంస్థల కార్యకర్తలను కలిసేవాడు.
అన్సారీ మొదటి 2005, 2006 మధ్య కాలంలో శిక్షణ కోసం 21 రోజుల పాటు పాకిస్తాన్లో ఉన్నాడు. అతనితో పాటు మరో ఆరుగురు కూడా పాకిస్తాన్ వెళ్లారు. అజ్మల్ కసబ్, ఇతరులకు శిక్షణ ఇచ్చిన స్థలంలోనే అతను కూడా శిక్షణ పొందాడని అంటారు. శిక్షణా స్థలంలోనే అతను లష్కరే తోయిబా టాప్ కమాండర్స్ జకీ - ఉర్ - రెహ్మాన్ లఖ్వీ, జరార్ షాలను కలిశాడు. వీరిద్దరు కూడా ముంబై దాడుల కేసులో నిందితులు.
యువకులను బ్రైయిన్ వాష్ చేసి రిక్రూట్ చేసుకునే పని మీద అన్సారీ తిరిగి ఇండియా వచ్చాడు. ఉగ్రవాద శిక్షణ కోసం అతను దాదాపు డజను మందిని పాకిస్తాన్కు పంపించాడు. వారిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఢిల్లీ పోలీసులకు 2009 ఆగస్టు 25వ తేదీన చిక్కిన అస్లామ్ కాశ్మీర్ ఒకతను. ఇతను కూడా లఖ్వీని, షాను కలిసినవారిలో ఉన్నాడని చెబుతారు.
అన్సారీ తొలి ముఖ్యమైన పని ఆర్డీఎక్స్, ఎకె 47 అసాల్ట్ రైఫిళ్లను స్మగుల్ చేయడం. హవాలా ద్వారా వచ్చిన డబ్బులతో అన్సారీ వాహనాలను అద్దెకు తీసుకుని హ్యాండ్ గ్రెనేడ్స్, అసాల్ట్ రైఫిళ్లను, లైవ్ బుల్లెట్లను సరఫరా తరలించేవాడని చెబుతారు. అయితే, ఔరంగబాద్లో భారీ ఆపరేషన్ కోసం వేసిన ప్రణాళికకు కన్సైన్మెంట్ పంపాల్సిందని, అయితే పోలీసులు గుర్తించడంతో అతని ప్రయత్నం విఫలమైందని, మాలెగావ్లో వాహనాన్ని వదిలేశాడని చెబుతారు.
పోలీసులు అన్సారీ గ్రామంలో సోదాలు నిర్వహించారు. కానీ అక్కడ ఏమీ లభించలేదు. అన్సారీ పేరు పత్రికల్లో వస్తుండడంతో అతని తల్లిదండ్రులు ఊరు వదిలిపెట్టారు. ఓ ఏడాది క్రితం తిరిగి వచ్చారు. జుందాల్ జన్మించిన ఇల్లు తాళం వేసి ఉన్నట్లు తెలుస్తోంది.