చెడ్డపేరు వద్దనే: కేంద్రమంత్రి పదవికి వీరభద్ర రాజీనామా
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన నిజాయితీని నిరూపించుకునేందుకే రాజీనామా చేసినట్లు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు. తనపై ఆరోపణల కోసం చూపిన ఆధారాలు అన్ని కల్పితమైనవని చెప్పారు. సిడి ప్రామాణికాబద్దమైనది కాదన్నారు. సిడిలోని వాయిస్తో తన వాయిస్ను సరిపోల్చుకోలేదని చెప్పారు.
కాగా వీరభద్ర సింగ్, ఆయన భార్యపై కుట్ర, అవినీతి సంబంధించిన కేసులు నమోదు చేయాలని సిమ్లాలోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల క్రిందట జరిగిన ఈ వ్యవహారంలో మంత్రి, ఆయన భార్య ప్రతిభాసింగ్ల నేరాలకు కచ్ఛితమైన సాక్ష్యాధారాలు లభించిన నేపథ్యంలో ఐపిసి సెక్షన్ 120 బి(కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని 7,11,13 సెక్షన్ల ప్రకారం ప్రత్యేక న్యాయమూర్తి బిఎల్ సోని కేసు నమోదుకు ఆదేశించారు.
కాగా, ప్రస్తుతం లఘు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్న వీరభద్ర సింగ్ 1989లో హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో కొందరు పారిశ్రామికవేత్తలతోపాటు ఐఎఎస్ అధికారి మహిందర్ లాల్తో లంచం, ఇతర అవినీతి పరమైన లావాదేవీలపై సింగ్ జరిపిన సంభాషణలు రికార్డైయ్యాయి.
ఆ ఆడియో సీడి ఆధారంగా ఈ కేసు నడుస్తుండగా, ఈ సీడిని మాజీ కాంగ్రెస్ మంత్రి విజయ్ సింగ్ మన్కోటియా 2007 మేలో విడుదల చేశారు. దీని ఆధారంగానే వీరభద్ర సింగ్, ఆయన భార్యపై తాజా కేసుల నమోదుకు కోర్టు ఆదేశించింది. ఇదిలావుంటే కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీడిలో ఉన్నదంతా బూటకమని, అందులో వినిపించేది తన గొంతు కాదని వీరభద్ర సింగ్ మీడియా ప్రతినిధులతో అన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరభద్ర సింగ్, ఆయన భార్య 1989లో అంబుజ సిమెంట్స్ నుంచి 3 లక్షల రూపాయలు, మీకెన్ బ్రేవరీ నుంచి 2 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ప్రాసిక్యూషన్ ఆరోపణ. సిమెంటు ప్లాంట్, వ్యర్థపదార్థాల శుద్ధి కర్మాగార స్థాపనకు అనుమతి ఇచ్చేందుకు వారు ఆ లంచం తీసుకున్నట్లు ఆరోపణ. వీరభద్ర సింగ్ రాజీనామా చేయాలని అన్నా హజారే టీమ్ డిమాండ్ చేసింది.