కాల్ లిస్టుపై జెడి ఫిర్యాదు: అరెస్టులకు రంగం సిద్ధం

కాలి లిస్టును సంపాదించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు ఇచ్చిన సాక్షి దినపత్రిక సీనియర్ విలేకరి యాదగిరి రెడ్డి, ఆయనకు సహకరించిన నాచారం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావులను నేడో, రేపో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సెల్ఫోన్ కాల్ లిస్ట్ను, నెంబర్లను బయటపెట్టడంపై జేడీ లక్ష్మీనారాయణ, లీడ్ ఇండియా ప్రతినిధి చంద్రబాల వేర్వేరుగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుల దర్యాప్తు బాధ్యతను ఉభయ కమిషనర్లు సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు.
ఎమ్మార్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పారిశ్రామిక వేత్త జేడీ కాల్లిస్టును నాగపూర్కు చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా సంపాదించిన సంగతి ఇప్పటికే స్పష్టమైంది. దీని ఆధారంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ఆయన మీడియా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు మంగళవారం ఉదయం సిబిఐ ఉన్నతాధికారులు లక్ష్మినారాయణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ క్రమంలో లక్ష్మీనారాయణ డిజిపి దినేశ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. "నేను వాడే రెండు సెల్ఫోన్లు సీబీఐ అధికారిక నెంబర్లు. వాటి కాల్లిస్ట్లు కావాలనుకుంటే... సమాచార హక్కు చట్టం కింద నేరుగా సీబీఐకే దరఖాస్తు చేయాలి. కొందరు వ్యక్తులు అనధికార మార్గాల్లో నా నెంబర్ల కాల్ డేటా రికార్డులు తెప్పించారు. దీనివల్ల నా విధులకు భంగం కలిగింది. సాక్షుల రక్షణ ప్రమాదంలో పడింది'' అని జేడీ లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో చెప్పినట్లు సమాచారం. కాల్లిస్టును అనైతిక మార్గంలో తెప్పించి, బహిర్గతం చేసిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సిబిఐ జెడి ఫిర్యాదును మంగళవారం రాత్రి డిజిపి హైదరాబాద్ కమిషనర్ అనురాగ్ శర్మకు పంపించారు. ఆ వెంటనే కమిషనర్ దీనిని సీసీఎస్ డీసీపీకి పంపి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. వాస్తవానికి సీబీఐ జేడీకి సంబంధించిన టెలిఫోన్ నెంబర్ హైదరాబాద్ సీబీఐ ఎస్పీ పేరిట ఉంటుంది. కాల్లిస్టు తెప్పించిన పారిశ్రామిక వేత్త, ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహకుడు, నాందేడ్ జిల్లా ఎస్పీతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరిని, మహారాష్ట్ర పోలీసు అధికారులు కొందరిని ఎఫ్ఐఆర్లో ముద్దాయిలుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications