జగన్ను కలిసేందుకు వైయస్ వివేకాకు నో: అరెస్టై నెల

దీంతో వివేకా జైలు వద్దనే బైఠాయించారు. ప్రభుత్వం తమ కుటుంబం పైన కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనను తన తనయుడు జగన్ను కలవనివ్వడం లేదని ఆరోపించారు. జగన్తో కలిసేందుకు తనకు జైలు అధికారులు అనుమతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. జైలు అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. కుటుంబ సభ్యులను అనుమతించక పోవడమేమిటని ప్రశ్నించారు.
జైలు అధికారుల తీరు చూస్తుంటే ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. కేసుల నుండి జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తాడన్నారు. ఒక వ్యక్తిపై ఇంతగా కక్ష సాధించడం సరికాదన్నారు. జగన్కు ప్రజల ఆశీస్సులు, అండదండలు ఉన్నాయని చెప్పారు. ఆయనతో వచ్చిన పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వివేకాను అనుమతించాలని డిమాండ్ చేశారు.
జగన్ను గత నెల 27వ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టు తర్వాత వైయస్ వివేకా కలిసేందుకు రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఓసారి కలిసేందుకు వచ్చారు. కానీ అప్పుడు జగన్ బాబాయితో మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేశారనే వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ రోజు మరోసారి వివేకా కలిసేందుకు వచ్చారు. ఇటీవల మాజీ స్పీకర్, రాష్ట్రపతి రేసులో ఉన్న పిఏ సంగ్మాకు కూడా జైలు అధికారులు జగన్ను కలిసేందుకు అనుమతి నిరాకరించారు.
ములాఖత్లు అయిపోయినందునే అనుమతించలేదని జైలు అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. గతంలో జగన్ సతీమణి భారతికి కూడా ఓసారి జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆమె తిరిగి వెళ్లారు. ఆ తర్వాత పలుమార్లు కుటుంబ సభ్యులు జగన్ను కలుసుకున్నారు. కాగా జగన్ అరెస్టు అయి నేటికి నెల రోజులు. జగన్ మే 27న అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications