పనేం లేదా: నారా లోకేష్ ఎంట్రీకి ఒత్తిడిపై చంద్రబాబు

రాజకీయాల్లోకి నారా లోకేష్ను తేవాలనే ఒత్తిడి ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పెరుగుతోంది. ఈ మేరకు తెలుగుయువత, విద్యార్థి సంఘాల నేతలు కొందరు బుధవారం చంద్రబాబును కలిసి లోకేశ్కు తెలుగు యువత అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ వినతిపత్రం అందజేశారు. ఉత్తరప్రదేశ్లో ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ సమాజ్వాది పార్టీని అధికారంలోకి తేవడాన్ని వారు ఉదాహరిస్తున్నారు. రాష్ట్రంలోనూ లోకేశ్ సమర్థంగా బాధ్యత లు నెరవేర్చగలరని వారు అంటున్నారు.
'విద్యార్థులు, యువత పార్టీవైపు అంతగా ఆకర్షితులు కావడం లేదు. లోకేశ్ను రంగప్రవేశం చేయిస్తే చంద్రబాబు కుమారుడుగా కొంత ఆకర్షణ ఏర్పడుతుంది. అందుకే వినతిపత్రం ఇచ్చాం' అని జిమ్మి బాబు, మద్దిపట్ల సూర్యప్రకాష్ తదితరులు అన్నారు. పార్టీలో యువ రక్తాన్ని పెంచాలని సీనియర్లు కూడా అంగీకరిస్తున్నారు. 'ఇది ఇప్పుడు కచ్చితంగా అవసరం. అలాగైతేనే పార్టీ బతుకుతుంది. ఈసారి 50-60 శాతం సీట్లు కొత్తవారికి, యువతకు ఇవ్వాలి. అప్పుడే దూకుడుగా వెళ్లగలం' అని ఆరుసార్లు ఎమ్మెల్యే, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు.
అంతకు ముందు కొందరు ఇలా సూచించినా, 'లోకేశ్నో... మరొకరినో తేవడం పరిష్కారం కాదు. దూరమైన వర్గాలను దరిచేర్చుకోవడానికి ఏంచేస్తున్నామన్నదే ముఖ్యం' అని చంద్రబాబు స్పష్టత ఇచ్చేందుకు యత్నించారు. సీనియర్ నేతలు యువతను పెద్దగా ముందుకు రానీయడం లేదని, అందుకే లోకేశ్వంటి వారి గురించి తాము మాట్లాడాల్సి వస్తోందని తెలుగుయువత నిజామాబాద్ జిల్లాశాఖ అధ్యక్షుడు వేణుగోపాల్ యాదవ్ అన్నారు. అందువల్ల ఎన్టీఆర్ లేదా చంద్రబాబు కుటుంబాల నుంచి వచ్చేవారైతే పార్టీకి ఆకర్షణతోపాటు వారి సారథ్యంలో యువతకు ప్రోత్సాహం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
కాగా, స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన హీరోలు బాలకృష్ణను, జూనియర్ ఎన్టీఆర్లతో పాటు నారా లోకేష్ను కూడా రాజకీయాల్లోకి తెచ్చి వారికి తలా ఓ బాధ్యతను అప్పగించాలని తిరుపతి నియోజకవర్గం సమీక్షా సమావేశంలో పార్టీ నాయకులు చంద్రబాబుకు సూచించారు.












Click it and Unblock the Notifications