జెడి కాల్ లిస్టుపై విచారణకు జగన్ పార్టీ డిమాండ్
సీబీఐ జేడీ పలువురు మీడియా ప్రతినిధులతో అనేకమార్లు ఫోన్లో మాట్లాడటంపై ఆయా మీడియాలలో ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా పలు అసత్యమైన కథనాలను ప్రచురించారంటూ విజయమ్మ డీజీపీకి ఈ నెల 26న ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్రెడ్డితోపాటు తమ కుటుంబాన్ని అంతమొందించేందుకు కూడా కుట్ర జరుగుతోందనిఆ ఫిర్యాదులో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసుశాఖ త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డీజీపీకి తాజాగా విజ్ఞప్తి చేశారు.
ఫోన్ కాల్ వివరాలకు సంబంధించి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, వాసిరెడ్డి చంద్రబాల ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు హుటాహుటిన కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని, విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దర్యాప్తు జరపాలని ఈ సందర్భంగా కోరారు. చంద్రబాల, సీబీఐ జేడీ ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన కేసులను రాష్ట్ర నేర పరిశోధన విభాగాని(సీఐడీ)కి బదిలీ చేసినందున విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదు కేసును కూడా సీఐడీకే ఇవ్వాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.
ఎంపీ జగన్మోహన్రెడ్డికి మొదటి నుంచీ వ్యతిరేకంగా ఉన్న మీడియా యాజమాన్యం, వ్యాపారపరంగా జగన్కు వ్యతిరేకంగా ఉన్న వారితో సీబీఐ జేడీ అనేకమార్లు ఫోన్లో మాట్లాడటం అనుమానాలను రేకెత్తిస్తున్నాయని శాసనసభ్యులు అన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ దర్యాప్తు తీరు సవ్యంగా సాగడంలేదనే అంశంపై విజయమ్మ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు, సీబీఐ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులకు, కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారని వివరించారు.
తమ విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, విజయమ్మ ఇచ్చిన ఫిర్యాదును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్శర్మకు పంపానని వెల్లడించారని ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కూడా కలిసి విజయమ్మ ఫిర్యాదుపై దర్యాప్తు చేయాల్సిందిగా కోరతామన్నారు.