ఎస్కార్ట్ పోలీసుల కళ్లు గప్పి 'జాకీ చాన్' పరారీ

వివరాలు ఇలా ఉన్నాయి - ప్రకాశం జిల్లా సంత మగుళూరుకు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబానికి దోపిడీ, దొంగతనాలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వెంకటేశ్వర్లు గత పదేళ్లుగా అనేక దోపిడీ, దొంగతనాలు, హత్య కేసుతో సంబంధం ఉండి వివిధ జైళ్లలో విచారణ ఖైదీగా ఉన్నాడు. గత ఏడాదిన్నర కాలంగా చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న వెంకటేశ్వర్లును దొంగతనం కేసు విచారణ కోసం జైలు అధికారులు సోమవారం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కోర్టుకు తరలించారు.
కోర్టు విచారణ అనంతరం సాయుధ రిజర్వ్ కానిస్టేబుళ్లు గోపాల్, సతీష్ ఎస్కార్ట్గా ఉంటూ వెంకటేశ్వర్లును నిర్మల్ నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తీసుకువచ్చారు. అదే సమయంలో బస్ స్టేషన్ నుంచి సదరు విచారణ ఖైదీని పోలీసు జీపులో ఎన్ఎఫ్సీ అశోక్నగర్ చర్లపల్లి పారిశ్రామిక వాడ మీదుగా చర్లపల్లి జైలుకు తీసుకురావాల్సి ఉంది.
కాగా చర్లపల్లి రైలు విహార్ వద్ద నున్న స్పీడ్ బ్రేక్ వద్ద జీపు ఒక్కసారిగా స్పీడ్ తగ్గడంతో ఇదే అదునుగా భావించిన వెంకటేశ్వర్లు పోలీసులు చూస్తుండగానే ఒక్క ఉదుటున జీపు దిగి పారిపోయాడు. నివ్వెరపోయిన ఎస్కార్ట్ పోలీసులు తేరుకుని చూసేలోపే ఖైదీ చీకట్లో మాయమయ్యాడు.
గతంలో ఒకటి రెండుసార్లు ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన అనుభవం కలిగిన వెంకటేశ్వర్లు అదను కోసం వేచి ఉండి అర్థరాత్రి సమయంలో సునాయసంగా తప్పించుకోగలిగాడు. తిరుగు ప్రయాణంలో కూడా వెంకటేశ్వర్లుకు పోలీసులు బేడీలు వేయలేదు.












Click it and Unblock the Notifications