జూ.ఎన్టీఆర్ ఆరోపణలపై స్పందిస్తా: నాని, జగన్తో భేటీ
తాను తెలుగుదేశం పార్టీని వీడినట్లేనని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలపై త్వరలో స్పందిస్తానని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసులో ఎప్పుడు చేరేది త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ, హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆరోపణలపై త్వరలో స్పందిస్తానని చెప్పారు. నానితో పాటు జగన్ను కలిసిన వారిలో ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయవాడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.
నాని ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మను కలిసిన విషయం తెలిసిందే. ఆమెతో సుమారు ఇరవై నిమిషాలకు పైగా నాని మంతనాలు జరిపారు. అనంతరం జగన్ను కలుసుకునేందుకు ముందే అనుమతి తీసుకున్నారు. మధ్యాహ్నం ఒకటింటి ప్రాంతంలో జగన్తో భేటీ అయ్యారు. విజయమ్మతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను జగన్తో భేటీ అయ్యాక తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పిన విషయం తెలిసిందే.
2009లో టిడిపి పార్టీ నుండి గెలిచిన నాని కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన ఏ క్షణంలోనైనా జగన్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఉప ఎన్నికల తర్వాత జగన్తో కలిసి నాని ఉన్న ఫ్లెక్సీలు విజయవాడలో వెలిశాయి. ఆ తర్వాత ఆయన బాబును కలిశారు. బాబును కలిసిన అనంతరం కూడా ప్రచారం ఆగలేదు. ఈ రోజు(సోమవారం) జగన్ పార్టీ అధినేతతో భేటీ ద్వారా ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళుతున్నట్లు స్పష్టమైపోయింది. నాని తీరుపై టిడిపి నేతలు మండిపడ్డారు.
రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, హీరో జూనియర్ ఎన్టీఆర్లు కూడా నాని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాని గుడివాడ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బాబుపై కొన్నాళ్లుగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. ప్రోటోకాల్లో తనను పట్టించుకోలేదని నాని గతంలో బాబుకు ఫిర్యాదు చేశారు. అప్పుడే తాను పార్టీ వీడుతానని హెచ్చరించారు. ఏడాది క్రితం నానికి పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై ఆయన అసంతృప్తికి లోనయ్యారని సమాచారం. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా దేవినేని ఉమామహేశ్వర రావును ప్రోత్సహిస్తున్నట్లు ఆయన భావిస్తున్నారని అంటున్నారు.