వైయస్ జగన్ దెబ్బ: కాంగ్రెసు, టిడిపి ఓటు బ్యాంక్ గుల్ల
కాంగ్రెసు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి విడివిడిగా తమకుంటూ ఓటు బ్యాంకులను సృష్టించుకున్నాయి. రాష్ట్రంలోని రెండు ఆధిపత్య కులాలు రెండు పార్టీలకు అండగా ఉంటూ వచ్చాయి. కాంగ్రెసు పార్టీకి రెడ్లు, తెలుగుదేశం పార్టీకు కమ్మలు గట్టిగా పట్టునిస్తూ వచ్చారు. అయితే, ఇప్పుడు ఆ రెండు పార్టీలను వారు వదిలేస్తున్నట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు చూస్తున్నట్లు అంచనాలు సాగుతున్నాయి. 2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలిచిన కాపు సామాజిక వర్గం కూడా వైయస్సార్ కాంగ్రెసు వైపు ఏదో మేరకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
1983, 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వరుసగా అపజయం పాలైనప్పటికీ దాని ఓటు బ్యాంకు మాత్రం చెదరలేదు. కాంగ్రెసు ఓటు బ్యాంకు కూడా నిలుస్తూ వచ్చింది. తటస్థ ఓటర్లే జయాపజయాలను నిర్ణయిస్తూ వచ్చారు. సీమాంధ్రలో 175 శానససభా స్థానాలు, 25 లోకసభ స్థానాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సీమాంధ్రలో అత్యధిక స్థానాలు సాధించడం అనివార్యంగా మారింది. అయితే, కుల సమీకరణాలు ప్రస్తుతం సీమాంధ్ర గణనీయంగా మారాయి. కాంగ్రెసు తమకు స్థిరమైన ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు, గిరిజనులు, రెడ్లు, మైనారిటీ వర్గాల్లో కూడా తన పట్టును కోల్పోతోంది.
తెలుగుదేశం పార్టీ నుంచి కమ్మలు, బిసీలు దూరమవుతున్నారు. బిసీలు తమకు దూరమయ్యారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ బహిరంగంగానే అంగీకరిస్తోంది. 2009 ఎన్నికల్లో మూడింట రెండు వంతలు మంది రెడ్లు కాంగ్రెసు ఓటేశారని రాజకీయ విశ్లేషకుల అంచనా. అదే రీతిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడ్డాయి. యాభై శాతానికి పైగా కాపు సామాజిక వర్గం ఓట్లు ప్రజారాజ్యం పార్టీకి పోలయ్యాయి.
కాంగ్రెసు పార్టీకి యాభై శాతం మంది మాలలు, మాదిగలు ఓట్లేసినట్లు అంచనా. మహా కూటమి కట్టిన తెలుగుదేశం పార్టీకి యాభై శాతం మంది యాదవులు, గౌడలు, ఓబిసీలు యాభై శాతానికి పైగా ఓట్లేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో రెడ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. కమ్మ ఆధిపత్యం మూడు జిల్లాల్లో, కాపుల ఆధిపత్యం రెండు జిల్లాల్లో, బీసిల ఆధిపత్యం మూడు జిల్లాల్లో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాదులో ముస్లీం మైనారిటీల ఆధిపత్యం ఉంది. ఈ ఆధిపత్య సామాజిక వర్గాలు మాత్రమే అధికారాన్ని పంచుకుంటాయి.
ఇప్పుడు పరిస్థితులు మారాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత వైయస్సార్ కాంగ్రెసు వైపు దూకేసింది. పలువురు మంత్రులు, కాంగ్రెసు నాయకుల పిల్లలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇతర సామాజిక వర్గాలు కూడా క్రమంగా కాంగ్రెసు పార్టీకి దూరమవుతున్నాయి. ఈ స్థితిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలం పుంజుకుంటూ తెలుగదేశం, కాంగ్రెసు పార్టీలకు సవాల్ విసురుతోంది.