సుప్రీంకెక్కిన జగన్, ఓటేసిందుకు అనుమతికి విజ్ఞప్తి
తాను ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీలోనే ఉన్నానని, ఐదు రోజుల పాటు విచారణకు సహకరించానని, తనపై క్విడ్ ఫ్రోకో ఆరోపణలను సిబిఐ రుజువు చేయలేకపోయిందని వైయస్ జగన్ తన బెయిల్ పిటిషన్లో అన్నారు. తాను దేశం విడిచి వెళ్లబోనని ఆయన అన్నారు. ఈడి విచారణకు సహకరిస్తానని ఆయన చెప్పారు, ఈడి కోరితే ఎక్కడైనా విచారణకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా ప్రజా సమస్యలపై పోరాడాల్సి ఉందని ఆయన చెప్పారు.
హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ బెయిల్ ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. తనపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితాలేనని ఆయన అన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తుందని ఆరోపిస్తుందన్న సిబిఐ చార్జిషీట్లు దాఖలు చేస్తోందని, ఎన్ని రోజులు చార్జిషీట్లు దాఖలు చేస్తుందో తెలియదని, అంత వరకు జైలులో ఉండాల్సిన పరిస్థితి కల్పిస్తోందని ఆయన అన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తోందని ఆరోపణ చేస్తున్న సిబిఐ అందుకు రుజువులు చూపలేకపోతోందని ఆయన అన్నారు. జైలులో తనకు ప్రాణహాని ఉందని, అందుకు బెయిల్ ఇవ్వాలని ఆయన అన్నారు.
విచారణ పేరుతో సిబిఐ కాలయాపన చేస్తోందని, ఇంకా ఎన్ని రోజులు తనను జైలులో ఉంచుతారని ఆయన అన్నారు. సిబిఐ తన ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తోందని, తాను 9 నెలలుగా సిబిఐ విచారణకు సహకరిస్తున్నానని ఆయన చెప్పారు. సిబిఐ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. విచారణ అంశాలను కావాలనే సిబిఐ లీక్ చేస్తోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను హైకోర్టు ఇటీవల తిరస్కరించింది.