కర్ణాటక క్రైసిస్: మరో ట్విస్ట్ ఇచ్చిన యడ్యూరప్ప
సదానంద గౌడ వర్గానికి ఆ పదవి దక్కకుండా చేయడానికి యడ్యారప్ప కొత్త డిమాండ్ను ముందుకు తెచ్చారు. రెండు ముఖ్యమంత్రి పదవులు సృష్టించాలని, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి తన వర్గానికి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. రేపు మంగళవారం బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో జగదీష్ షెట్టర్ను కొత్త నేతగా ఎన్నుకుంటారు. పార్టీ అధిష్టానం పరిశీలకులుగా శానససభా పక్ష సమావేశంలో పాల్గొనడానికి అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్ సోమవారం సాయంత్రం బెంగళూర్ చేరుకుంటున్నారు.
కాగా, మంత్రి పదవుల కోసం అప్పుడే బిజెపి శాసనసభ్యులు లాబీయింగ్ ప్రారంభించారు. కర్ణాటక బిజెపి వ్యవహారాల ఇంచార్జీ ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పదవి నుంచి తప్పుకుంటున్న సదానంద గౌడతో, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కెఎస్ ఈశ్వరప్పతో సంప్రదింపులు జరిపారు. పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఆయనను కలిశారు.
ఆగస్టులో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సదానంద గౌడ యడ్యూరప్ప వర్గానికి చెందిన మంత్రులందరినీ కొనసాగించారు. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఈశ్వరప్పతో పాటు రవాణా, హోం మంత్రి అశోక, మరో మంత్రి గోవింద ఎం కర్జోల్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. సదానంద గౌడ కర్జోల్ పేరును ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ముందుకు తెస్తున్నారు. దళిత నాయకుడైన కర్జోల్ యడ్యూరప్ప వ్యతిరేక వర్గానికి చెందినవారు. దీంతో యడ్యూరప్ప మరో ఉప ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారు. ఈ స్థితిలో బిజెపి అధిష్టానం ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టించకపోవచ్చుననే మాట వినిపిస్తోంది.
ఇదిలావుంటే, యడ్యూరప్ప తమపై చేసిన ఆరోపణలను మాజీ ప్రధాని, జెడిఎస్ అదినేత హెచ్డి దేవెగౌడ ఖండించారు. సదానంద గౌడతో తనకు సంబంధం లేదని ఆయన సోమవారం స్పష్టం చేశారు. సదానంద తాము చెప్పినట్లుగా వినలేదని, ఈ విషయంలో యడ్యూరప్ప తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. గత ఏడు నెలలుగా తాను సదానంద గౌడతో మాట్లాడలేదని ఆయన చెప్పారు.