ప్రధాని మన్మహన్ సింగ్ ఫెయిల్: టైమ్ మ్యాగజైన్ వ్యాఖ్య
'విఫలుడు-భారత్కు పునరుత్తేజం అవసరం' శీర్షికన త్వరలో మార్కెట్లోకి రాబోయే టైమ్ మాగజైన్ ఆసియా ఎడిషన్లో మన్మోహన్పై కవర్ స్టోరీని ప్రచురించింది. ఆర్థిక మందగమనం, వృద్ధిరేటు తగ్గుదల, భారీ ఆర్థికలోటు, రూపాయి పతనం తదితర సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని, అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం మాత్రం అవినీతి కుంభకోణాలను ఎలా నిరోధించాలా అని యోచిస్తోందని, ఆర్థిక విధానాలకు సంబంధించి ఆ ప్రభుత్వానికి మార్గనిర్దేశకత్వం కొరవడిందని విమర్శించింది.
దేశవిదేశాల్లోని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోతున్నారని, ఓటర్లూ నమ్మకాన్ని కోల్పోతున్నారని, రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వరుస కుంభకోణాలు ప్రభుత్వ సమర్థతను ప్రశ్నార్థకం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. యుపిఎతోపాటు మన్మోహన్ అనుసరించిన విధానాలను విమర్శించింది. కనీసం ఒక్క ఎన్నికలో కూడా గెలవకపోయినా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మన్మోహన్ను ప్రధానిగా నియమించారని వ్యాఖ్యానించింది. మన్మోహన్ ఆమెకు నీడ అంటూ అభివర్ణించింది.
మూడేళ్ల సమయాన్ని మన్మోహన్ వృథా చేశారని, గతంలో చూపినఆత్మవిశ్వాసం ఇప్పుడు మన్మోహన్లో కనిపించడం లేదని వివరించింది. తన మంత్రులనే నియంత్రించలేనట్లు ఆయన కనిపిస్తున్నారని, ప్రణబ్ ముఖర్జీ రాజీనామా నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించడంలో మన్మోహన్ సమర్థతను కూడా టైమ్ మేగజైన్ ప్రశ్నించింది. ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు దోహదపడే చట్టాలన్నీ పార్లమెంటులోనే నిలిచిపోతున్నాయని తప్పుబట్టింది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో సాహసోపేతమైన సంస్కరణలు చేయాలని, భారీ సబ్సిడీలకు స్వస్తి పలకాలని, డీజిల్ ధరలను డీరెగ్యులరైజ్ చేయాలని, వాల్మార్ట్ వంటి బహుళ ఉత్పత్తుల రీటెయిలర్లను భారత్లోకి అనుమతించాలని పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారని వివరించింది. మన్మోహన్ పనితీరుపై 2014లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఓటర్లు సుస్పష్టంగా తీర్పు ఇవ్వనున్నారని తెలిపింది. సింగ్ ఈజ్ కింగ్ అంటూ మన్మోహన్ మళ్లీ గర్జిస్తారా... లేక ఒంటరిగా మిగిలిపోతారా? అనే ప్రశ్నకు కాలమే జవాబు చెబుతుందని వ్యాఖ్యానించిం ది.
యూపీఏ అధినేత్రి సోనియాగాంధీతో ఆయన కుదుర్చుకున్న 'అనధికార అధికార భాగస్వామ్య ఒప్పందమే' మన్మోహన్ చేతులు కట్టేస్తోందని, పార్టీలోని ఇతర ప్రముఖులపై చర్యలు తీసుకోలేని నిస్సహాయత కల్పిస్తోందని కొందరు భావిస్తున్నారని టైమ్ మేగజైన్ పేర్కొంది. వీధి దీపాల కింద చదువుకోవడం దగ్గర నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఎన్నికవ్వడం వరకూ మన్మోహన్ను ప్రశంసిస్తూనే.. ఆయన నియంత్రణలో లేని అంశాలు చాలానే ఉన్నాయని వివరించింది.