రాష్ట్రపతి ఎన్నిక: ప్రణబ్కే వైయస్ జగన్ ఓటు?

రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై నిర్ణయం తీసుకునే బాధ్యతను జగన్కు కట్టబెడుతూ ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిర్ణయం చేసింది. వైయస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు తేలలేదు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రకటించే అవకాశాలున్నాయి.
వైయస్ జగన్ కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పిఎ సంగ్మాకు బిజెపి మద్దతు ఇస్తోంది. దీంతో మైనారిటీల మద్దతు పోతుందనే భయంతో వైయస్ జగన్ సంగ్మాకు ఓటేసే అవకాశాలు లేనట్లు చెబుతున్నారు. బిజెపితో తాను జత కట్టబోనని ఆయన పదే పదే చెబుతూ వచ్చారు. ఇప్పుడు సంగ్మాకు ఓటేస్తే మైనారిటీ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో కాంగ్రెసు నాయకత్వాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, జాతీయ స్థాయిలో జత కట్టాల్సి వస్తే యుపిఎలోనే ఉండడానికి ఆయన నిర్ణయించుకున్నట్లు కూడా అర్థం చేసుకోవచ్చు. గతంలో జాతీయ మీడియాతో ఆయన ఈ విషయం చెప్పారు కూడా. కాంగ్రెసు పార్టీతో జగన్ కుమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ వస్తోంది. ప్రణబ్ ముఖర్జీకి ఓటేస్తే తమ విమర్శలు నిజమేనని తెలుగుదేశం పార్టీ జగన్పై మరింతగా తన విమర్శలకు పదును పెట్టే అవకాశాలున్నాయి. అయినా సరే, ప్రణబ్ ముఖర్జీకి ఓటేయాలనే ఉద్దేశంతోనే జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17 మంది శాసనసభ్యులు, ఇద్దరు లోకసభ సభ్యులు ఉన్నారు. వీరంతా ప్రణబ్ ముఖర్జీకి ఓటేస్తే విజయం మరింత సులువు అవుతుంది. తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ కూడా ప్రణబ్ ముఖర్జీ వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చారు. అయితే, తర్వాత ఆయన మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తటస్థ వైఖరి అవలంబించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications